యూఏఈలోని భారతీయ నర్సులు రిజిస్టర్డ్ నర్సులుగా కొనసాగింపు
- June 30, 2016
యూఏఈలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న భారతీయ నర్సులకు కొండంత ఉపశమనం లభించింది. ఉద్యోగం ఎక్కడ పోతుందోనని చాలా రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వందలాదిమంది నర్సులు ప్రభుత్వం నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే నర్సులకు తప్పనిసరిగా మూడున్నరేళ్ల నర్సింగ్ డిప్లమో ఉండాల్సిందేనని ఇటీవల యూఏఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ అర్హత లేనివారిని రిజిస్టర్డ్ నర్సుల నుంచి ప్రాక్టికల్ నర్సుగా మార్చాలని నిర్ణయించింది. దీంతో యూఏఈలోని భారతీయ నర్సులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారంతా 1990 కంటే ముందే మూడేళ్ల డిప్లమో కోర్సును పూర్తిచేసినవారు. దీంతో ప్రాక్టికల్ నర్సులుగా డిమోషన్ తప్పదని భావించారు. నర్సుల ఆవేదనను దృష్టిలో పెట్టుకుని భారత రాయబార కార్యాలయం, భారత అంతర్గత మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాయి. ఈ విషయంలో కేరళ ఎన్ఆర్ఐ కమిషన్ తొలి సభ్యుడు డాక్టర్ షంషీర్ వయలిల్ కీలక పాత్ర పోషించారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలోని తొలి సెక్రటరీ(కమ్యూనిటీ అఫైర్స్) దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయంలో యూఏఈ ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. నర్సుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వారిని రిజిస్టర్డ్ నర్సులుగానే కొనసాగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించినట్టు తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రులలో చేరే నర్సులకు మాత్రం మూడున్నరేళ్ల డిప్లమో కోర్సు నిబంధన వర్తిస్తుందని వివరించారు. ఇప్పటికే డిమోషన్ ఇచ్చిన నర్సులకు తిరిగి పూర్వపు స్థానంలో నియమిస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రాక్టికల్ నర్సులుగా ప్రభుత్వం డిమోషన్ ఇచ్చినా వేతనాలు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







