ఆస్కార్స్ సభ్యత్వంలో భారీ మార్పులకు శ్రీకారం

- June 30, 2016 , by Maagulf
ఆస్కార్స్ సభ్యత్వంలో భారీ మార్పులకు శ్రీకారం

ఆస్కార్స్‌లో ప్రక్షాళన మొదలైంది. అకాడమీ అవార్డుల ఎంపిక కోసం తాజాగా సభ్యత్వాన్ని పెంచారు. హాలీవుడ్‌లో శ్వేతజాతీయుల పెత్తనం పెరిగిందని ఇటీవల విమర్శలు తలెత్తడంతో ఆస్కార్స్ నిర్వాహకులు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అవార్డు ఎంపికలో ఉండే సభ్యుల సంఖ్యను పెంచనున్నారు. వర్ణవివక్ష వల్లే నల్లజాతీయులకు అవార్డులు రావడం లేదంటూ ఈ ఏడాది జరిగిన ఆస్కార్స్ వేడుకల సందర్భంగా నిరసన వ్యక్తం అయ్యింది. అయితే అకాడమీలో ఉన్న వర్ణవివక్షకు అంతం పలుకుతామని ఆ సందర్భంగా ఆస్కార్స్ కమిటీ స్పష్టం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అకాడమీ ఇప్పుడు సభ్యత్వాన్ని పెంచింది. ఈసారి సుమారు 700 మందిని ఆస్కార్స్ ఓటింగ్ కోసం ఎంపిక చేశారు. కొత్త సభ్యుల్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. అందులోనూ మైనార్టీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తాజా సభ్యత్వంలో సుమారు 650 మందికి పైగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020వ సంవత్సరం లోపు అకాడమీ అవార్డుల కమిటీలో మహిళల, మైనార్టీల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్తగా ఆస్కార్స్ సభ్యత్వాన్ని స్వీకరించిన నటుల్లో జాన్ బోయేగా(స్టార్ వార్స్‌), ఎమ్మా వాట్సన్ (హ్యారీ పోటర్‌), అలిసియా వికాండర్‌, మేరీ బ్లిడ్జ్ ఉన్నట్లు అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి ఆస్కార్స్ కమిటీలో మొత్తం ఆరు వేల మంది సభ్యులు ఉన్నారు. అందులో మగవాళ్లు 75 శాతం ఉన్నారు. కొత్తగా మహిళా సభ్యత్వాన్ని పెంచడం వల్ల పురుషుల సంఖ్య 75 శాతానికి పడిపోతుంది. అకాడమీ కమిటీలో శ్వేతజాతీయుల సంఖ్య కూడా 92 శాతం నుంచి 89 శాతానికి తగ్గనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com