వైఎస్‌ జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం

- February 10, 2025 , by Maagulf
వైఎస్‌ జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాస ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు. వివిధ జిల్లాల నుంచి సుమారు 1000 మందికి పైగా కానిస్టేబుల్ అభ్యర్థులు వస్తున్నట్లు సమాచారం రావడంతో సీఎం జగన్ నివాస ప్రాంతం, పాత టోల్‌గేట్‌, సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. భద్రతా చర్యల్లో భాగంగా తాడేపల్లి వస్తున్న అభ్యర్థులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు తగ్గించాలన్న డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించని వారికి 5 మార్కులు కలిపితే తదుపరి ఈవెంట్లకు క్వాలిఫై అవుతామని వారు అభ్యర్థిస్తున్నారు.

ఈ డిమాండ్‌తోనే సీఎం జగన్‌ను కలిసేందుకు రెడీ అయ్యారు కానిస్టేబుల్ అభ్యర్థులు. వినతి పత్రం ఇచ్చి తమ ఆవేదనను తెలిపేందుకు పలు జిల్లాల నుంచి తరలివస్తున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వీరిని ఎక్కడికిక్కడ అడ్డుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. దాదాపు 4,58,219 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈనెల 5న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల్లో సుమారు 99వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే కటాఫ్‌ మార్కులు తగ్గించాలని, దీనివల్ల మరికొంతమంది ఈవెంట్లకు అర్హత సాధిస్తారని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com