అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- February 19, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలలో జరుగుతున్న నాన్-డ్యూటీ పేడ్ లిక్కర్ సరఫరా చైన్ను అధికారులు భగ్నం చేశారు. పలువురిని అరెస్టు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ఈ దీనికి నేతృత్వం వహించి, ప్రైవేట్ రవాణా సేవలు, డిజిటల్ లావాదేవీల ద్వారా నడిచిన విస్తృత నెట్వర్క్ను వెలుగులోకి తీసుకొచ్చింది. చెన్నైకి చెందిన సరఫరాదారు ఎస్. ప్రభు ఈ అక్రమ మద్యం సరఫరా వ్యవస్థకు కేంద్ర పాత్రధారిగా గుర్తించబడ్డాడు.
తొలిగా తూర్పు గోదావరి జిల్లాలో వెలుగులోకి…గత ఏడాది డిసెంబర్ 27న తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి (ఉత్తరం) పోలీసులు ఎక్సైజ్ సవరణ చట్టం 2020 కింద సెక్షన్ 34(a)(1) మేరకు ఎఫ్ఐఆర్ నంబర్ 378/2024 నమోదు చేశారు. మొత్తం 112 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు, అందులో జానీ వాకర్, గ్లెన్మోరాంజీ, చివాస్ రిగల్, జాక్ డేనియల్స్ వంటి ప్రీమియం బ్రాండ్లు ఉన్నాయి. రాజమండ్రికి చెందిన బుర్ల బాలకృష్ణ, ముప్పన రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలలోని నాణ్యతా లోపాలు, మూతెలలో తేడాలు కనిపించడంతో అవి కేవలం ఎన్ డి పి ఎల్ కాదని, నకిలీ మద్యం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తమైంది. దర్యాప్తులో, ఈ మద్యం చెన్నైలోని ఎస్. ప్రభు నుండి సరఫరా చేయబడిందని నిర్ధారణ అయింది. ప్రభు ఆంధ్రప్రదేశ్లోని అనేక అక్రమ విక్రయదారులకు ప్రధాన సరఫరాదారిగా గుర్తించబడ్డాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మరో కేసు
కీలక ఆధారాలపై ఎస్ టి ఎఫ్ దర్యాప్తును విస్తరించ జనవరి 8 న భీమవరంలో మరో కేసును గుర్తించింది. ఎఫ్ఐఆర్ నంబర్ 09/2025 కింద కేసు నమోదు చేశారు. ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు నుండి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు భీమవరంకి చెందిన కొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో కూడా మద్యం సరఫరా ప్రణాళికా బద్ధంగా సాగిందని, చెన్నైకి చెందిన ప్రభు ఈ వ్యవస్థను నడిపిస్తున్నట్లు తేలింది.
విజయవాడ కేంద్రంగా మరో అక్రమ రవాణా
జనవరి 12న విజయవాడలో మరో ఎన్ డి పి ఎల్ కేసును పోలీసులు గుర్తించారు. చివాస్ రిగల్, జానీ వాకర్ గోల్డ్ లేబుల్ రిజర్వ్ లాంటి 12 సీసాలను స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నంబర్ 4/2025 నమోదు చేశారు. ఈ కేసులో వెంకటరమణ ట్రాన్స్పోర్ట్కు చెందిన ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. నిందితుల విచారణలో, చెన్నై నుండి ప్రైవేట్ రవాణా సేవల ద్వారా మద్యం అక్రమ రవాణా జరుగుతోందని తేలింది. వెంకటరమణ ట్రాన్స్పోర్ట్లో మద్యం తరలింపునకు సహకరించిన మేనేజర్లు ఇంకా పరారీలో ఉన్నారు.
నెల్లూరులో మళ్లీ నేరంలో ఇరుక్కున్న ఉల్లంఘనదారు
జనవరి 13న నెల్లూరు జిల్లాలో ఎఫ్ఐఆర్ నంబర్ 12/2025 (AP ప్రొహిబిషన్ చట్టం 1995) కింద మరో కేసు నమోదైంది. 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని మునిశామి నాగరాజు అనే నిందితున్ని అరెస్టు చేశారు. అతను గత ఎనిమిదేళ్లుగా అక్రమ మద్యం వ్యాపారంలో ఉన్నాడు. 2017లో ఇదే ఆరోపణలపై అరెస్టు అయినా, కోర్టులో అతనికి విముక్తి లభించింది. విచారణలో, చెన్నై నుండి ప్రైవేట్ రవాణా సేవల ద్వారా మద్యం అందించబడిందని స్పష్టమైంది.
నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన నిందితులు
చెన్నైకి చెందిన ఎస్. ప్రభు మరియు వ్యాసర్పాడికి చెందిన మాణిక్యం ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా గుర్తించబడ్డారు. వీరు ఫోన్ కాల్స్ లేదా వాయిస్ మెసేజెస్ ద్వారా మద్యం ఆర్డర్లు తీసుకుంటారు. మద్యం సీసాలను ప్యాక్ చేసి వెంకటరమణ ట్రాన్స్పోర్ట్, ఎస్ ఆర్ కె ఏ ఎల్ టి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపి, డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మద్యం నిల్వ చేయకుండా, డిమాండ్ ఆధారంగా సరఫరా చేయడం వీరి ప్రత్యేకత.
చెన్నైలో కీలక అరెస్టు – ప్రధాన నిందితుడి పట్టివేత
జనవరి 28 న స్థానికంగా ఎన్ డి పి ఎల్ సరఫరా చేస్తున్న సమయంలో ఎస్.ప్రభు చెన్నై పోలీసుల చేతిలో పట్టుబడ్డాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నంబర్ 6/2025 కింద కేసు నమోదు చేసి పుజల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంటనే నెల్లూరు ప్రధాన న్యాయమూర్తి కోర్టు నుండి పిటి వారెంట్ పొందడంతో, నెల్లూరు-1 టౌన్ స్టేషన్ పోలీసులు చెన్నైకి వెళ్లి అతనిపై విచారణ ప్రారంభించారు.
ఈ కీలక ఆపరేషన్ను ఎస్. మధు, జగదీశ్వర రెడ్డి ఇతర అధికారుల సమన్వయంతో నిర్వహించారు. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా రాష్ట్ర టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులను ఈ నేపథ్యంలో ప్రశంసించారు. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ మార్గదర్శకత వల్లే ఈ పెద్ద నెట్వర్క్ను ధ్వంసం చేయగలిగామని తెలిపారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!