ఇకపై భారత్ మొత్తానికీ ఒకటే డ్రైవింగ్ లైసెన్స్!!

- October 14, 2018 , by Maagulf
ఇకపై భారత్ మొత్తానికీ ఒకటే డ్రైవింగ్ లైసెన్స్!!

ఇంతవరకూ ఆధార్ కార్డులను చూశాం. యూనిక్ నంబర్ తో దేశమంతటా చెల్లుతుంది. అదే తరహాలో ఇపుడు ఇండియా అంతటా ఒకే డ్రైవింగ్ లైసెన్స్ ని తీసుకురాబోతున్నారు. ఇది నిజంగా వాహనదారులకు శుభవార్తే.. ముఖ్యంగా ఉద్యోగులు బదిలీలతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారికి ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే 2019 జులై నుంచి దేశవ్యాప్తంగా ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కొత్త డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ)లను జారీచేయనున్నారు.

కసరత్తు మొదలు:
ఈ విధానానికి సంబంధించి కసరత్తు మొదలైపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన రంగు, ఒకే విధమైన డిజైన్, ఒకే రకమైన సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను ప్రవేశపెట్టనున్నారు. కార్డు వివరాలను వేగంగా గుర్తించడానికి వీటిల్లో 'నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను కూడా తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా విధానాన్ని రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే మొదలుపెట్టింది. కొత్తగా జారీచేసే వీటిల్లో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్‌లను పొందుపరచనున్నారు.

కొత్త విధానంతో సులువు:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో రోజుకు 32,000 కొత్త డ్రైవింగ్ లైసెన్సుల జారీ లేదా రెన్యూవల్ జరుగుతున్నాయి. రోజుకు 43,000 వాహనాలు కొత్తగా రిజిస్టర్ లేదా రీ-రిజిస్టర్ అవుతున్నాయి. వీరందరికీ కూడా కొత్తగా ప్రవేశపెట్టిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను రవాణాశాఖ జారీచేయనుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనుంది. ఈ కొత్త కార్డుల ధర కూడా రూ.15 - 20 మించకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇకపై ఆ పౌరుడికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడమే కాకుండా గుర్తింపు కార్డుగా వుంటుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com