'నా తండ్రిని నా ముందే కాల్చి చంపారు': మాజీ దుబాయ్ నివాసి పహల్గామ్ భయానక అనుభవం..!!
- April 26, 2025
యూఏఈ: దుబాయ్ నివాసి ఆరతి మీనన్ తన తల్లిదండ్రులు, ఆరేళ్ల కవల కుమారులతో కలిసి కాశ్మీర్కు ప్రయాణించినప్పుడు, ఆ విశ్రాంతి యాత్ర తనకు పీడకలగా మారుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఈ వారం ప్రారంభంలో భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాద దాడికి పాల్పడిన ముష్కరులలో ఒకరు ఆరతి తండ్రిని కాల్చి చంపారు.
"ఒక ముష్కరుడు మా వద్దకు వచ్చి ఏదో చెప్పాడు. కానీ మేము అతని మాటలను అర్థం చేసుకోలేకపోయాము" అని ఆమె దక్షిణ భారత రాష్ట్రమైన కొచ్చిలో తెలిపారు. "ఐదు సెకన్లలోపు అతను నా ముందే నా తండ్రిని కాల్చి చంపాడు. నేను అతని శరీరాన్ని పట్టుకొని ఏడ్చాను. అతను చనిపోయాడని నాకు వెంటనే అర్థమైంది." అని తన భయంకర అనుభవాన్ని చెబుతూ కన్నీంటిపర్యంతమయ్యారు.
ఆమె తండ్రి, 65 ఏళ్ల రామచంద్రన్. గతంలో దుబాయ్ నివాసి కూడా. బైసరన్ లోయలో మరణించిన 26 మందిలో అతను ఉన్నారు. ఆ దుండగుడు తనపై కూడా తుపాకీ గురిపెట్టాడని ఆరతి చెప్పింది. “అతను నా తలపై తుపాకీ గురిపెట్టాడు” అని ఆమె గుర్తుచేసుకుంది. “అతను నన్ను చంపాలనుకున్నాడో, లేదా నన్ను భయపెట్టాలనుకున్నాడో నాకు తెలియదు. నా పిల్లలు బిగ్గరగా ఏడవడం, అరవడం మొదలుపెట్టారు. బహుశా అందుకే అతను నన్ను కాల్చకుండా వెళ్లిపోయాడు..” అని పేర్కొన్నారు.
ఆరతి, ఆమె కుటుంబం సంఘటనకు ముందు రోజు ఏప్రిల్ 21న కాశ్మీర్ చేరుకున్నారు. దాడికి కేవలం పది నిమిషాల ముందు 'మినీ స్విట్జర్లాండ్' అని పిలువబడే లోయకు చేరుకున్నారు. ఆమె తల్లి కారులోనే ఉండిపోయింది, ఆమె తన తండ్రి , పిల్లలతో కలిసి రైడ్ను ఆస్వాదించడానికి వెళ్ళింది.
"నేను మొదట పెద్ద శబ్దం విన్నప్పుడు, అది పటాకులు పేల్చినట్లు అనుకున్నాను" అని ఆమె చెప్పింది. "రెండవ శబ్దం విన్నప్పుడు, దూరం నుండి ఎవరో ఆకాశం వైపు కాల్పులు జరుపుతున్నట్లు నేను చూశాను. అది ఉగ్రవాద దాడి అని నేను వెంటనే అర్థం చేసుకున్నాను. నా తండ్రి, పిల్లలతో పారిపోవడం ప్రారంభించాను." ఆ కుటుంబం కంచె కింద నుంచి తప్పించుకుంది, కానీ తన తండ్రిని చంపిన మరొక షూటర్ తప్పించుకోలేక పోయినట్లు తెలిపింది. ఈ సంఘటన తర్వాత ఆమె నిమిషాల తరబడి స్తంభించిపోయానని చెప్పింది. "నా పిల్లలు 'అమ్మా, అమ్మా' అని అరవడం ప్రారంభించారు. అదే నాకు మేల్కొలుపు కాల్" అని ఆమె గుర్తుచేసుకుంది. "మేము కొండ దిగి పరిగెత్తాము. దాదాపు ఏడు నిమిషాల్లో, సైన్యం అంబులెన్స్ ఆ ప్రాంతానికి వచ్చాయి. నాకు మొబైల్ సిగ్నల్ తిరిగి వచ్చిన వెంటనే, నేను నా డ్రైవర్ ముజఫర్కు ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నానో చెప్పాను."
'నాకు కాశ్మీర్లో ఇద్దరు సోదరులు ఉన్నారు'
స్థానిక కాశ్మీరీలు తనతో వ్యవహరించిన తీరును ఆరతి ప్రశంసించింది. "ముజఫర్, మరొక వ్యక్తి సమీర్ ఇద్దరూ నన్ను సోదరిలా చూసుకున్నారు. నన్ను మార్చురీకి తీసుకెళ్లారు, అక్కడ నేను తెల్లవారుజామున 3 గంటల వరకు వేచి ఉన్నాను" అని ఆమె చెప్పింది. "కాశ్మీర్లో నాకు ఇద్దరు సోదరులు దొరికారు. వారు నన్ను అలాగే చూశారు." అని భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సంఘటన తర్వాత, తన తండ్రి చనిపోయాడని తన తల్లికి తెలియజేయకూడదనేది తన ఆలోచనగా ఉందని ఆమె అన్నారు. "మా హోటల్ గదితోపాటు శ్రీనగర్ విమానాశ్రయంలో కూడా టీవీ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేయమని చెప్పా." అని ఆమె తెలిపింది "నా తండ్రి గాయపడ్డాడని, చికిత్స అవసరమని నేను నా తల్లికి చెప్పాను. ఆ సమయంలో నా తల్లిని , నా పిల్లలకు ధైర్యం చెప్పేందుకు నేను బలంగా ఉండాల్సి వచ్చింది. మేము కేరళకు తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే నేను ఆమెకు నిజం చెప్పాను." అని తన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు ఆరతి.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









