థియేటర్లకు శుభవార్త చెప్పిన కేంద్రం

- September 04, 2025 , by Maagulf
థియేటర్లకు శుభవార్త చెప్పిన కేంద్రం

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం సినిమా అభిమానులకు పెద్ద గిఫ్ట్ అందించింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇది నిజమైన శుభవార్త. వినోద రంగంపై ఉన్న పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్లు, థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌పై జీఎస్టీ రేట్లు సవరించబడ్డాయి.ఈ మార్పు వల్ల చిన్న థియేటర్లకు ఆర్థిక ఊరట లభించనుంది.తాజా నిబంధనల ప్రకారం రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అంటే ఇప్పుడు చిన్న పట్టణాల్లో సినిమా చూడటం మరింత చవకగా మారనుంది. అయితే రూ.100 కంటే ఎక్కువ ధర పలికే టికెట్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీ యథాతథంగానే కొనసాగుతుంది. దీనివల్ల మల్టీప్లెక్స్‌లు లేదా ప్రీమియం థియేటర్లకు పెద్దగా లాభం ఉండదు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం ఇది నిజమైన ఊరటగా మారబోతోంది.

ప్రేక్షకులు థియేటర్‌లో ఎక్కువగా కొనేవి పాప్‌కార్న్. కానీ దీని మీద జీఎస్టీ విషయంలో గతంలో గందరగోళం నెలకొనేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యను క్లియర్ చేసింది. ఇకపై ప్యాకేజింగ్ ఎలా ఉన్నా, సాల్టెడ్ పాప్‌కార్న్‌పై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది. అయితే క్యారమెల్ పాప్‌కార్న్‌పై మాత్రం 18 శాతం పన్ను విధిస్తారు. గతంలో ప్యాకేజ్డ్, లూజ్ పాప్‌కార్న్‌లకు వేర్వేరు రేట్లు ఉండగా, ఇప్పుడు స్పష్టమైన నిబంధన తీసుకువచ్చారు.ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ పన్ను భారంతో నష్టాల్లో ఉన్న థియేటర్లు ఈ మార్పుతో నిలదొక్కుకునే అవకాశముంది. అదే సమయంలో ప్రేక్షకులు కూడా తక్కువ ధరలో సినిమాలు చూడగలుగుతారు. ఫలితంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్ల సందడి పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com