కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...

- October 05, 2025 , by Maagulf
కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...

కరీంనగర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం  కరీంనగర్లో  పథ సంచాలన్ నిర్వహించింది.కరీంనగర్ లోని పలు ప్రాంతాల మీదుగా సాగిన రూట్ మార్చ్ లో భారీ ఎత్తున పాల్గొని టిటిడి కళ్యాణమండపం వరకు కవాతు నిర్వహించారు.  అనంతరం  టిటిడి కళ్యాణమండపం లో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్.జి ముఖ్య అతిథిగా హాజరై స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడమే ఆశయంగా, సమాజ, దేశ సేవ లక్ష్యంగా డాక్టర్ కేశవ్ రావు  బలి రామ్  పంత్  హెడ్గేవార్ (డాక్టర్ జి) ఆర్ఎస్ఎస్ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్ లో 1925 న విజయదశమి రోజున అతి చిన్న వయసు కలిగిన పదిమంది పిల్లలతో ప్రారంభించారని   తెలిపారు.అలాంటి  ఆర్ఎస్ఎస్ నేడు కోట్లాదిమంది స్వయం సేవకులను కలిగి ,  దేశ,సమాజ సేవలో అత్యంత ప్రభావిత సంస్థగా మారిందన్నారు.ఈ విజయదశమి కి ఆర్ఎస్ఎస్  100  ఏళ్లు పూర్తి  చేసుకుంటున్నా శుభ సందర్భంలో శతజయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు.  వందేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అతిపెద్ద జాతీయవాద సంస్థ గా ఆర్ఎస్ఎస్ చరిత్రలో  నిలిచిపోయిందన్నారు.ఒకనాడు మహారాష్ట్రకే పరిమితమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలకు విస్తరించిందనీ చెప్పారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కు సర్ సంఘ చాలకులుగా  పనిచేసిన ఎంతోమంది పెద్దలు  ఆర్ఎస్ఎస్ ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధార పోశారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ పుట్టిందే మాతృభూమి సేవ కోసమన్నారు. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భరతమాత రూపంగా భావించి , భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల కోసం , దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం ,  సమాజసేవ కోసం కోట్లాది  స్వయం సేవకులు నిరంతరం పనిచేస్తు,  నిస్వార్ధ సేవ లక్ష్యంతో ముందుకు కొనసాగుతుందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు పంచ పరివర్తన్ 
లక్ష్యం దిశగా కొనసాగుతున్నాయన్నారు. ఇందులో ముఖ్యంగా ఐదు అంశాలను  స్వయం సేవకులు ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక పవర్ హౌస్ లాంటిదని, ఒక పవర్ హౌస్ నుండి కరెంటు దేశంలోని అన్ని అవసరాలకు ఎలా  ఉపయోగపడుతుందో...ఆర్ఎస్ఎస్ కూడా అదేవిధంగా దేశం కోసం ఉపయోగపడే పని చేస్తుందన్నారు. ముఖ్యంగా వ్యక్తి సరైన వాడైతే సమాజం కూడా సరైన దిశలో ప్రయాణిస్తుందని తెలిపారు.ప్రధానంగా సంఘం నిర్వహించే శాఖ పద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణాన్ని చేస్తుందనీ, గంటసేపు శాఖలో జరిగే వివిధ కార్యక్రమాల తో వ్యక్తి వికాసం కోసం కృషి చేస్తుందన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, దేశాన్ని ప్రపంచంలోనే గురువు స్థానంలో ఉంచాలనే సంకల్పంతో ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com