జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- November 02, 2025
అమరావతి: నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్లింది. అనంతరం జోగిరమేశ్ తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్టు చేశారు. అయితే, జోగి రమేశ్ అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ‘ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని జగన్ అన్నారు.
గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని, బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మొంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారని కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్ అయ్యారు.
నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే.. చంద్రబాబు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు..? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటూ జగన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







