తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్

- November 06, 2025 , by Maagulf
తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్

తిరుమల: తెలంగాణ రాష్ట్రంలో భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్రంలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో త్వరలోనే తెలంగాణలోని కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాలలో కొత్త ఆలయాలను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌గా తమ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడ్డాయని బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం లడ్డూలు 10 రోజుల వరకు తాజాగా, వాసన రహితంగా ఉంటున్నాయని భక్తులు చెబుతున్నారన్నారు. భక్తులకు శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించడానికి, అన్నప్రసాదం తయారీలో అత్యుత్తమ నాణ్యత గల పదార్థాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. స్థానికులకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి, ప్రతి నెల మొదటి మంగళవారం రోజున 3 వేల మంది తిరుపతి స్థానికుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు వ్యక్తుల పేరు మీద ఉన్న కాటేజీలకు ఆ పద్ధతిని నిలిపివేశామని, ఇకపై కాటేజీలకు దేవతామూర్తుల పేర్లు పెడతామని నాయుడు పేర్కొన్నారు. టీటీడీ కొనుగోళ్ల విభాగంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ (ACB) విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తేలితే ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు అవుతుందనే ఊహాగానాలను ఆయన ఖండించారు. తిరుపతి విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా మార్చడంపై త్వరలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.తిరుమల, ఒంటిమిట్ట ప్రాంతాలలో ఔషధ, పవిత్ర వనాలను అభివృద్ధి చేయాలని టీటీడీ యోచిస్తోందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com