తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

- December 15, 2025 , by Maagulf
తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా “తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్టత, తెలంగాణ అంటే ఆతిథ్యం” అని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన అన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నగరానికి విచ్చేసి క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచిన ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమానికి హాజరై, శనివారం సాయంత్రాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన నగరంలోని అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. వచ్చిన అతిథులకు అత్యుత్తమ ఆతిథ్యం అందించడంలో క్రమశిక్షణతో వ్యవహరించిన క్రీడాభిమానులకు, ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ‘ది గోట్ మెస్సీ టూర్ ఇండియా 2025′ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి భారీ అంతర్జాతీయ ఈవెంట్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా, ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత మరియు నాయకత్వ పటిమ ఉన్నాయని ఆయన కొనియాడారు. నాగవంశీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “మెస్సీ టూర్ ఆద్యంతం ఎంతో సజావుగా సాగింది. ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడం గర్వంగా ఉంది. తెలంగాణ రైజింగ్ అనే మాట ఈ రోజు నిజమైందనిపిస్తోంది” అని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com