రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు

- December 15, 2025 , by Maagulf
రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

అనంతరం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భావితరాల కోసమే రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. స్వర సార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. నెల్లూరులోని తన ఇంటిని వేద పాఠశాలకు బాలు ఇచ్చేశారని గుర్తు చేశారు. బాలు మన మధ్య లేకున్నా.. పాట రూపంలో మనతోనే ఉన్నారని చెప్పారు.

ప్రతిఒక్కరి మనస్సులో బాలసుబ్రహ్మణ్యం చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ వాదులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతోపాటు ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఆవిష్కరణ సమయంలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన తెలంగాణ వాదులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com