'తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి' అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు

- July 19, 2015 , by Maagulf
'తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి' అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షుడయ్యారు. ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. చాంబర్‌లో భాగమైన నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన, స్టూడియో - నాలుగు విభాగాల సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ నాలుగు సెక్టార్ల ఎన్నికలకు నిర్మాతలు - ఎగ్జిబిటర్లైన డి. సురేష్ బాబు, దిల్ రాజుల సారథ్యంలోని ఒక ప్యానెల్, నిర్మాతలు నట్టికుమార్, టి. ప్రసన్నకుమార్ల నేతృత్వంలోని మరో ప్యానెల్ పోటీపడ్డాయి. మొత్తం 48 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ను ఈ ఎన్నికల్లో ఎన్నుకున్నారు. సురేశ్‌బాబు ప్యానెల్ సభ్యులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. ఈ ఎన్నికైన సభ్యులు నాలుగు విభాగాల చైర్మన్లనూ ఎంపిక చేసుకున్నారు. పంపిణీదారుల విభాగానికి భరత్ చౌదరి, ప్రదర్శనదారుల విభాగానికి నారాయణబాబు, నిర్మాతల సెక్టార్‌కు ఆర్.కె. గౌడ్, స్టూడియో సెక్టార్‌కు నాగినీడు చైర్మన్లు అయ్యారు. ఇక, ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష పదవి రొటేషన్ పద్ధతిలో ఎగ్జిబిటర్ల విభాగానికి దక్కాలి. దాన్ని అనుసరించి తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా డి. సురేశ్‌బాబు ఏకీగ్రవంగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా 'ఆనంద్ సినీ సర్వీసెస్' కిరణ్, 'దిల్' రాజు, రమేష్, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్, రాందాస్, సురేందర్‌రెడ్డి, కోశాధికారిగా కొడాలి వెంకటేశ్వర రావు ఎన్నికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com