తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- January 09, 2026
హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (RTA) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాహనం కొనుగోలు చేసిన షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకునే అవకాశం కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణను అమలు చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విధానం అమలుకు అవసరమైన సాఫ్ట్వేర్ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ విధానం ప్రకారం, వాహన డీలర్లే కొనుగోలుదారుడి నుంచి అవసరమైన పత్రాలను — ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా వివరాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం — సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఆ పత్రాలను డిజిటల్ విధానంలోనే పరిశీలించి అనుమతి ఇస్తారు. అనంతరం వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించి, ఆర్సీ కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్టులో పంపిస్తారు.
ఈ కొత్త విధానం ద్వారా ప్రజల సమయం ఆదా కావడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాలపై ఉండే భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండే అవినీతికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత వినియోగానికి కొనుగోలు చేసే కొత్త కార్లు, మోటార్సైకిళ్లకే పరిమితం అవుతుంది. కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే కొనసాగుతాయి. ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసే వారు రవాణా శాఖ కొత్త సిరీస్ విడుదల చేసే వరకు వేచిచూడాల్సి ఉంటుంది.
తెలంగాణలో ప్రతిరోజూ సగటున సుమారు 3,000 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్న నేపథ్యంలో, ఈ విధానం అమల్లోకి వస్తే లక్షలాది వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్’, ‘సారథి’ పోర్టళ్లను పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. డీలర్ల వద్ద వాహనాల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం మాత్రం రవాణా శాఖ వద్దే ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









