తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- January 09, 2026
హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (RTA) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాహనం కొనుగోలు చేసిన షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకునే అవకాశం కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణను అమలు చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విధానం అమలుకు అవసరమైన సాఫ్ట్వేర్ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ విధానం ప్రకారం, వాహన డీలర్లే కొనుగోలుదారుడి నుంచి అవసరమైన పత్రాలను — ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా వివరాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం — సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఆ పత్రాలను డిజిటల్ విధానంలోనే పరిశీలించి అనుమతి ఇస్తారు. అనంతరం వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించి, ఆర్సీ కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్టులో పంపిస్తారు.
ఈ కొత్త విధానం ద్వారా ప్రజల సమయం ఆదా కావడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాలపై ఉండే భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండే అవినీతికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత వినియోగానికి కొనుగోలు చేసే కొత్త కార్లు, మోటార్సైకిళ్లకే పరిమితం అవుతుంది. కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే కొనసాగుతాయి. ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసే వారు రవాణా శాఖ కొత్త సిరీస్ విడుదల చేసే వరకు వేచిచూడాల్సి ఉంటుంది.
తెలంగాణలో ప్రతిరోజూ సగటున సుమారు 3,000 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్న నేపథ్యంలో, ఈ విధానం అమల్లోకి వస్తే లక్షలాది వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్’, ‘సారథి’ పోర్టళ్లను పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. డీలర్ల వద్ద వాహనాల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం మాత్రం రవాణా శాఖ వద్దే ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







