ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- February 04, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో చిన్నారులు, మహిళల అదృశ్యం కలకలం రేపుతోంది. భారత రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగించే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2026 ప్రారంభంలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే (జనవరి 1 నుంచి 15 వరకు) ఏకంగా 807 మంది అదృశ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ గణంకాలను నిశితంగా పరిశీలిస్తే, అదృశ్యమైన వారిలో మహిళలు మరియు బాలికల సంఖ్య అత్యధికంగా ఉండటం గమనార్హం. మొత్తం 807 మందిలో 509 మంది మహిళలు, బాలికలే ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పురుషుల అదృశ్యాల సంఖ్య 298గా నమోదైంది. ఈ తరహా సామూహిక అదృశ్యాలు రాజధాని నగరంలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
ముఖ్యంగా చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ 15 రోజుల్లో మాయమైన వారిలో 196 మంది మైనర్లు ఉండగా, వారిలో 146 మంది కేవలం బాలికలే కావడం గమనార్హం. అంటే సుమారు 75 శాతం మైనర్ అదృశ్యాలు బాలికలవే కావడం మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందేమోనన్న అనుమానాలను బలపరుస్తోంది. గత ఏడాది (2025) రికార్డులను పరిశీలిస్తే, ఢిల్లీలో మొత్తం 24,508 మంది తప్పిపోయారు. అందులో సగానికి పైగా, అంటే 14,870 మంది మహిళలే ఉన్నారు. వీరిలో 15,421 మంది ఆచూకీని పోలీసులు కనుగొనగలిగినప్పటికీ, మిగిలిన వేల మంది జాడ ఇప్పటికీ తెలియకపోవడం బాధాకరం.
ఈ అదృశ్యాల వెనుక సామాజిక, ఆర్థిక కారణాలతో పాటు క్రిమినల్ గ్యాంగుల ప్రమేయం ఉండవచ్చని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నా, గాలింపు చర్యల్లో వేగం సరిపోవడం లేదని బాధితుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఢిల్లీ వంటి హై-సెక్యూరిటీ జోన్లలో సీసీటీవీ కెమెరాలు, పోలీసు నిఘా ఉన్నప్పటికీ ఇంతమంది మాయమవ్వడం పాలనా యంత్రాంగానికి పెను సవాలుగా మారింది. మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









