సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..

- February 17, 2026 , by Maagulf
సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..

న్యూ ఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్ధరెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. మరోవైపు.. నిందితుడు సిద్ధార్థ రెడ్డి జైలు శిక్షను పొండగించాలని కోరుతూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

ప్రముఖ నటి ప్రత్యూష మృతి కేసు అప్పట్లో టాలీవుడ్‌లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసుకుంటూ బీజీ ఆర్టిస్టుగా ప్రత్యూష కొనసాగింది. ఆ సమయంలోనే 2002 ఫిబ్రవరి 23వ తేదీన ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఈ ఘటనలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా.. చికిత్స పొందుతూ సిద్దార్ధ రెడ్డి కోలుకున్నాడు.

వారు కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమె పై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరిపింది.

నిందితుడు సిద్ధార్థ రెడ్డి పై పలు సెక్షన్ల కింద సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2004 ఫిబ్రవరి 23న నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. దీని పై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. జైలు శిక్షణను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50వేలకు పెంచుతూ 2011 డిసెంబర్ 28న కోర్టు తీర్పు వెలువరించింది.

అయితే, ప్రత్యూష హత్యకేసులో తాను దోషిని కాదని పేర్కొంటూ హైకోర్టు తీర్పును సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ప్రత్యూష తల్లి సరోజినీదేవి సైతం 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రత్యూష హత్య కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్షను పొడగించాలని అప్పీళ్లలో పేర్కొంది. అయితే, తాజాగా.. సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి, సరోజనీదేవి పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com