శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- February 17, 2026
అమరావతి: గ్లోబల్ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ ఎయిర్కండిషనింగ్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ కేంద్రం స్థాపనకు లీజ్ డీడ్పై సంతకం చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మాత్రమే కాకుండా వేగవంతమైన అమలు (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విధానానికి కట్టుబడి ఉందని తెలిపారు. శ్రీసిటీ హెచ్ వీ ఏ సిరంగంలో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, క్యారియర్ పెట్టుబడి దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు .
స్థిరమైన, శక్తి-సమర్థ వాణిజ్య శీతలీకరణ పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్ను శ్రీసిటీ ఫ్యాక్టరీ తీర్చడమే కాకుండా, స్థానిక ప్రతిభకు అర్థవంతమైన అవకాశాలను కల్పిస్తుంది. ఈ ప్లాంట్ పచ్చదనం ఆధారిత తయారీ విధానాలను అనుసరించి, గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించి, క్యారియర్ సంస్థకు విస్తృత స్థాయిలో తయారీ సామర్థ్యాన్ని అందించి, మార్కెట్ వృద్ధికి తోడ్పడుతుందని సుందరేశన్ నారాయణన్ అన్నారు.
డా.రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, క్యారియర్ పెట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శినిక నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక వాతావరణంపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ పరిశ్రమ స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరిగి, ఆధునిక తయారీ మరియు సుస్థిర ఆవిష్కరణల కేంద్రంగా శ్రీసిటీ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు .
ఈ ఒప్పందానికి ముందు ఇటీవల క్యారియర్ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి , ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను సంప్రదించి ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏసీ పరిశ్రమలకు మంచి అనుకూల వాతావరణం కలిగిన శ్రీసిటీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భారతదేశంలో క్యారియర్ సంస్థ ఉనికి మరింత బలపడనుంది. ఇప్పటికే హర్యానాలో ఉన్న తమ తయారీ కేంద్రానికి తోడుగా ఈ కొత్త యూనిట్ పనిచేస్తూ, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక సుస్థిర వృద్ధితో పాటు మార్కెట్లో నాయకత్వ స్థానాన్ని మరింత విస్తరించనున్నట్లు క్యారియర్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







