ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

- February 23, 2026 , by Maagulf
ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు, వస్తువులను ఇతర ప్రాంతాలకు పంపేవారికి దక్షిణ మధ్య రైల్వే (SCR) అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఇక పై భారీ పార్సిల్స్‌ను రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరుగా మీ ఇంటి నుంచే పంపించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినూత్నమైన ఈ “డోర్-టు-డోర్” పార్సిల్ సర్వీస్ ద్వారా వినియోగదారుల సమయం, శ్రమ ఆదా కానుంది.

ఫిబ్రవరి 25వ తేదీన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో రైల్ పార్సిల్ లాజిస్ట్రిక్స్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో రైల్ పార్శిల్ యాప్‌ను ఆయన లాంచ్ చేయనున్నారు. ఆ రోజు నుంచి ఈ యాప్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్‌లో ఈ పార్శిల్ సేవలను అందించనుండగా.. ఇక్కడ వచ్చే స్పందనను బట్టి అన్ని డివిజన్లకు విస్తరించనున్నారు. రైళ్ల ద్వారా పార్శిళ్లను వేగవంతంగా, పారదర్శకతో డెలివరీ చేస్తామని రైల్వేశాఖ చెబుతోంది. పార్శిళ్లకు భద్రత కూడా ఉంటుదని స్పష్టం చేసింది. ఈ సేవలను అమలు చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరుతో దక్షిణ మధ్య రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది.

రైల్ పార్శిల్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవడంతో పాటు ట్రాకింగ్, డెలివరీ స్టేటస్ వంటి అన్నీ సేవలు అందుబాటులో ఉంటాయి. పార్శిల్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతీ మూమెంట్ ట్రాక్ చేయవచ్చు. ఇక పార్శిల్ ఛార్జీలను డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ విధానంలో చెల్లించవచ్చు. ఇక వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్‌క పుష్ నోటిఫికేషన్ విధానంలో పొందవచ్చు. ఇప్పటివరకు రైళ్ల ద్వారా ఏదైనా పార్శిల్ పంపాలంటే స్టేషన్‌కు వెళ్లి పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ద్వారానే బుక్ చేసుకుని పార్శిల్ పంపవచ్చు. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు వేగవంతంగా డెలివరీ చేయవచ్చు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు ఈ పార్శిల్ సేవలను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీని వల్ల తక్కువ ఖర్చుతో పార్శిల్స్ ఎక్కడికైనా పంపించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com