విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

- February 27, 2026 , by Maagulf
విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

హైదరాబాద్: ప్రస్తుతం విద్యా రంగంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎల్‌కేజీ (LKG) నుంచే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయి. రకరకాల డెవలప్‌మెంట్ ఫీజులు, యాక్టివిటీ ఫీజుల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఎప్పటి నుంచో గళమెత్తుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఫీజుల నియంత్రణలో ఆశించిన ఫలితం రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ప్రైవేట్ విద్యాసంస్థల మౌలిక సదుపాయాలు మరియు ఫీజుల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘తెలంగాణ విద్యా కమిషన్’ సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

నిబంధనలను ఉల్లంఘించి.. ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతి రద్దుతో పాటు.. అధికంగా వసూలు చేసిన ఫీజును రికవరీ చేసేలా నిబంధనలు విధించాలని సీఎం రేవంత్ రెడ్డి.. విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి సలహాలను ప్రజాభిప్రాయం కోసం వెబ్‍సైట్‍లో ఉంచాలని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా శాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.కోర్ అర్బన్ రీజియన్‍లోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని పేర్కొన్నారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్స్‌ వంటి పెద్ద పెద్ద విద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com