ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు

- February 27, 2026 , by Maagulf
ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: ప్రజలు నిత్యం వినియోగించే ఆహర పదార్ధాలపై కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాలం చెల్లిన పాలు, సంబంధిత ఉత్పత్తులపై నిరంతర నిఘా అవసరమన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు వర్చువల్ సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు పి, నారాయణ, డాక్టర్ నిమ్మల రామానాయుడు, మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు ఘటనల్లో బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనల్లో బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం సీఎం ఆదేశించారు. రెండు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై కారణాలను విశ్లేషించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఘటన జరిగాక స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల్లోని జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే నివారించవచ్చని సీఎం అన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసేందుకు, ఆయా విభాగాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు.

ఒక్కో సందర్భంలో ఒక్కో శాఖపై ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కిందిస్థాయి అధికారులతో పాటు సంబంధిత శాఖల్లో జవాబుదారీతనం పెరుగుతుందని… అప్పుడు ఇలాంటి ఘటనలు నివారించవచ్చని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లు అంటే నిత్యం ప్రజల్లో ఉండాలని… అప్పుడే అనుకున్న మార్పు రాష్ట్ర స్థాయిలో చూపించగలమని సీఎం పేర్కొన్నారు. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితం అయిన ఘటనలో ముందస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. సీఎంతో సమీక్ష సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ శాఖ అధికారులు రెండు ఘటనల్లోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

డయేరియా ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఇప్పటి వరకూ 129 డయేరియా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 107 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యం మెరుగువ్వటంతో 20 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. డయేరియా పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పైపుల ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నాం. నాలుగు ఇంజనీరింగ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో 40 లీకులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. 150 మంది సిబ్బంది, 7 జేసీబీలు, 2 బాబ్ కాట్ యంత్రాలు, 10 టాక్టర్ల సాయంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాం. ఇవాళ రాత్రిలోగా విశాఖ నుంచి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను శ్రీకాకుళానికి తరలిస్తున్నాం.

ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. పారామెడిక్స్ ను అందుబాటులో ఉంచాం. రిమ్స్, కిమ్స్, శ్రీకాకుళం జెమ్స్ లో ప్రత్యేక వార్డుల ద్వారా డయేరియా రోగులకు చికిత్స అందిస్తున్నాం. నెఫ్రాలజీ నిపుణులు, ఇతర వైద్య నిపుణులను కూడా ఈ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం. డయేరియా వ్యాప్తికి కారణం ఏమిటన్న దానిపై విచారణ చేస్తున్నాం. డోర్ టూ డోర్ సర్వే చేసి శానిటేషన్ కిట్ను అందజేస్తున్నాం. స్థానికులు వాటర్ ట్యాంకులు క్లీన్ చేయకపోవడం, పైప్ లైన్ల డ్రైన్లు క్రాస్ అవ్వడంతో పాటు వాటర్ ప్రెజర్ లేదని మోటార్లు పెట్టి నీటిని తీసుకోవడం వల్ల కలుషిత నీరు ఇళ్లకు చేరిందని” అధికారులు తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో కల్తీ పాల ఘటన, బాధితులకు అందుతోన్న వైద్య సాయంపై సీఎంకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వివరించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ. ఈ నెల 22 తేదీ జరిగిన కల్తీ పాల ఘటన వెలుగులోకి వచ్చింది. 20 మంది కల్తీ పాల కారణంగా అనారోగ్యం పాలయ్యారు. ఈ వ్యవహారంలో ఐదుగురు మృతి చెందారు. 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ పాల సరఫరా జరిగిన చౌడేశ్వరీ నగర్, స్వరూప్ నగర్లో 9 వైద్య బృందాలను నియమించాం. 110 ఇళ్లను సందర్శించి 315 మంది నుంచి రక్త నమూనాలు కూడా సేకరించి విశ్లేషిస్తున్నాం. కల్తీ పాలను సేవించిన 957 మందిని ప్రతీ రోజూ పరీక్షిస్తున్నాం.

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందించాం. ఈ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలను కూడా అందుబాటలో ఉంచాం. ఈ ఘటనలో నిందితుడైన పాల సరఫరాదారు అడ్డాల గణేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నాం. అసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్గా ఉందని…ఇతర ప్రాంతల నుంచి వైద్య పరికరాలు తెప్పించి, నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నాం. మిగిలిన ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం” అని వివరించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీ చేస్తున్నారని అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, నిమ్మల రామనాయుడుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా నుంచి ఆన్ లైన్ విధానంలో రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, శ్రీకాకుళం, రాజమండ్రి ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com