కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి

- March 01, 2026 , by Maagulf
కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణవార్త పాకిస్థాన్‌లో చిచ్చు రేపింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారన్న సమాచారంతో ఆగ్రహానికి గురైన వందలాది మంది నిరసనకారులు ఆదివారం కరాచీలోని అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించారు. దీంతో కరాచీ వీధులు రణరంగాన్ని తలపించాయి. అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన ఆందోళనకారులు, కాన్సులేట్ భద్రతా వలయాలను ఛేదించుకుని లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.

కాన్సులేట్ వెలుపల భారీగా మోహరించిన పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపైకి విచక్షణారహితంగా రాళ్లు రువ్వగా, వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కొన్ని వీడియో దృశ్యాల ప్రకారం.. అనేకమంది నిరసనకారులు కాన్సులేట్ ప్రధాన గేట్లను బద్దలుకొట్టి కాంపౌండ్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న భవనం కిటికీ అద్దాలు, తలుపులను ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో కరాచీలోని దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సెగలు ఇప్పుడు పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కూడా పాకడంతో, అక్కడ ఉన్న విదేశీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com