వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..

- March 19, 2026 , by Maagulf
వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..

హైదరాబాద్: ఉగాది పండగని పురస్కరించుకుని 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ' (TGFA 2025) ప్రదానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మార్చి 19 సాయంత్రం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరిగింది. సుమ కనకాల, ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో సినిమా, థియేటర్, టెలివిజన్ రంగాల్లో విశిష్ట ప్రతిభను గుర్తించి సత్కరించారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2025లో విడుదలై సత్తా చాటిన సినిమాలకుగానూ వివిధ విభాగాల్లో అవార్డులు అందజేశారు. ప్రశంసా పత్రంతోపాటు, నగదు ప్రోత్సాహకాన్ని విజేతలకు పురష్కారాలు ఇచ్చారు. జ్యూరీ కమిటీకి గోల్డెన్‌ మెమెంటో, ప్రశంసా పత్రంతోపాటు నగదు ప్రోత్సాహకాన్ని టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు అందజేశారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, కింగ్ అక్కినేని నాగార్జున-అమల దంపతులు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, నాగ చైతన్య-శోభిత ధూళిపాళ దంపతులు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీ మోహన్, జయసుధ, నాగ సుశీల, టీజీ విశ్వప్రసాద్, వి. సముద్ర, తమ్మారెడ్డి భరద్వాజ, రోషన్ మేక, అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, రష్మిక, సాక్షి వైద్య, రితికా నాయక్, ప్రగతి, బీవీఎస్ఎన్ ప్రసాద్, కె.రాధాకృష్ణ, వంశీ నందిపాటి తదితరులు హాజరయ్యారు.

'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్'లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌ గా ఆట సందీప్-జ్యోతి దంపతులు (గిర గిర గిర - ఛాంపియ‌న్), ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ గా ఎం.ఆర్‌ రాధాకృష్ణన్ (కిష్కిందపురి), ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ గా తోట తరణి (ఛాంపియన్‌), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా చంద్రకాంత్ (ఛాంపియ‌న్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ గా కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) అవార్డులు స్వీకరించారు. జ్యూరీ క్యాటగిరీలో బెస్ట్ ఫిల్మ్ గా '23', చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి), అనంతిక (8 వసంతాలు) రోషన్ (ఛాంపియన్‌) పురష్కారాలు అందుకున్నారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ తన ప్రత్యేక ప్రదర్శనతో ఆకట్టుకుంది. దివంతట సావిత్రి, శ్రీదేవి, సౌందర్య నటీమణులకు నివాళిగా రూపొందించిన పాటలకు నిధి డ్యాన్స్ చేసింది. అలానే 'నాగబంధం' సినిమాలోని పాటకు నభా నటేష్ లైవ్ పర్ఫార్మన్స్ తో అలరించింది. సింగర్ మంగ్లీ కూడా తన పాటలతో సందడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com