ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

- March 23, 2026 , by Maagulf
ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని రాజయ్యపేటలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం సాయంత్రం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఈ ప్లాంట్ కీలకం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

భూమిపూజకు ముందు, ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి నమూనాను లక్ష్మీ మిట్టల్ ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం నేతలందరూ ప్లాంట్ స్థలంలో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియన్స్ జోన్’ను సందర్శించి, అక్కడ ప్రదర్శించిన సాంకేతికతను, భవిష్యత్ ప్రణాళికలను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉక్కును ఉత్పత్తి చేయడమే కాకుండా, పర్యావరణహితమైన పద్ధతులను పాటించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

రాజయ్యపేటలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిర్మాణ పనులు పూర్తి చేసి 2029 నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చగలదని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com