భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- March 27, 2026
యూఏఈ: యూఏఈని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాలలోని వీధులలో వరద నీరు నిలిచింది. దీంతో ఇళ్లు, కార్లు నీట మునిగాయని నివాసితులు తెలిపారు.
అల్ నుఐమియా, అల్ ఖోర్ నుండి అల్ రషీదియాలోని లోతట్టు ప్రాంతాలలోని నివాస ప్రాంతాలలో వరదనీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇళ్లలోకి నీరు చేరడం, పార్కింగ్ ప్రదేశాలు నీటి గుంటలుగా మారడం, బలమైన గాలుల వల్ల కిటికీలు, బాల్కనీలు దెబ్బతినడం వంటివి జరిగాయని పలువురు పేర్కొన్నారు.
అల్ రషీదియాలో చాలా మంది నివాసితులు చిన్న విల్లాలలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్లు, టైలర్లు, బేకర్లుగా పనిచేస్తుంటారు. ఇక్కడి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. "వర్షం పడటానికి ఒక రోజు ముందు, మేము పరుపు, దిండ్లు, మా సామాను వంటివి తరలించడం ప్రారంభించాము. టీవీని ఎత్తైన అరలో పెట్టి, ముఖ్యమైన వస్తువులను నేల మీద నుండి పక్కకు జరిపాము. 2024 ఏప్రిల్లో కురిసిన భారీ వర్షం మా మదిలో ఉంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అనుకున్నాము." అని డ్రైవర్ రఫీకుల్ హుస్సేన్ తెలిపాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇళ్లలోకి నీరు చేరిందని పేర్కొన్నాడు. దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నీరు లోపలే ఉండిపోయామని తెలిపాడు. భారీ వర్షం కురుస్తున్నప్పుడు తాము చేయగలిగింది ఏమీ లేకపోవడంతో, నిలబడి చూస్తూ ఉండిపోయామన్నారు. భారీ వర్షాల తర్వాత ముంపునకు గురైన ఇళ్లు, దెబ్బతిన్న కార్లతో యూఏఈ నివాసితులు ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు.
ఇక ఎత్తైన భవనాల్లో నివసించే నివాసితులు ఒక విభిన్నమైన సమస్యను ఎదుర్కొన్నారు. సిటీ టవర్లో నివసించే జెబా ఖాన్ మాట్లాడుతూ.. నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి తీవ్రంగా మారిందని చెప్పారు. “గాలి చాలా బలంగా వీచింది. బాల్కనీలో ఉంచిన వస్తువులు కదలడం ప్రారంభించి గోడలను తాకాయి. నా బాల్కనీ తలుపు బలంగా మూసుకుపోయి పగిలిపోయింది. అదే సమయంలో వంటగది కిటికీ కూడా పగిలిపోయింది. రెండు వైపుల నుండి వర్షపు నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. మేము హడావిడిగా అన్నింటినీ మూసివేసి, చుట్టూ టవల్స్ ఉంచాల్సి వచ్చింది.” అని ఖాన్ అన్నారు.
మరోవైపు పరిస్థితులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సమాచారం అందగానే వేగంగా స్పందిస్తున్నామని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము ఇరవై నాలుగు గంటలూ సిద్ధంగా ఉన్నామని అజ్మాన్ పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. వర్ష సంబంధిత సంఘటనల వల్ల వాహన నష్ట ధృవీకరణ పత్రాలు పొందడానికి లేదా నంబర్ ప్లేట్లు పోయినట్లయితే ఫిర్యాదు చేయడానికి నివాసితులు తమ స్మార్ట్ అప్లికేషన్ను ఉపయోగించుకోవచ్చని కూడా వారు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని అజ్మాన్ రవాణా అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







