అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

- April 02, 2026 , by Maagulf
అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చారిత్రాత్మక విజయం లభించింది.లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు) కు గురువారం (ఏప్రిల్ 2, 2026) నాడు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపింది. దీంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి, చట్టపరమైన రక్షణ లభించినట్లయ్యింది. చర్చను ప్రారంభించిన ఎంపీ రేణుకా చౌదరి, ఇది అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గౌరవమని పునరుద్ఘాటించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది.సభ్యులందరి మద్దతుతో మూజువాణి ఓటు (Voice Vote) ద్వారా బిల్లు ఆమోదం పొందింది.మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. ఇందులో 10 పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.”అమరావతికి ఆ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.ఈ చట్టం ఏపీ అభివృద్ధికి నాంది పలకాలి” అని ఆయన ఆకాంక్షించారు.పార్లమెంటులోని ఉభయ సభలు (లోక్‌సభ, రాజ్యసభ) ఆమోదించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది.రాష్ట్రపతి సంతకంతో ఇది అధికారికంగా చట్టంగా మారుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com