వణికిన ఉత్తర భారత్‌..ఢిల్లీలో భూకంపం!

- April 03, 2026 , by Maagulf
వణికిన ఉత్తర భారత్‌..ఢిల్లీలో భూకంపం!

న్యూ ఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు ఒక్కసారిగా వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలతో పాటు భారత్‌లోని పలు నగరాల్లో భూమి కంపించింది.

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతం ఈ భూకంపానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీతో పాటు పంజాబ్‌, హరియాణా, జమ్మూకశ్మీర్‌ మరియు కార్గిల్‌లోనూ ప్రజలు భూ ప్రకంపనలను స్పష్టంగా గుర్తించారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్ల నుంచి ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. అక్కడ ఇళ్లలోని ఫ్యాన్‌లు, షాండ్లియర్లు (చాండ్లియర్లు) జోరుగా ఊగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రకంపనలు వచ్చిన సమయంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కార్గిల్ ప్రాంతంలో కూడా భూమి కంపించడంతో జనం అప్రమత్తమయ్యారు.

ప్రస్తుతానికి ఈ భూకంపం కారణంగా భారత్‌లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయితే, అఫ్గానిస్థాన్‌లో మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com