హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు

- April 03, 2026 , by Maagulf
హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ (L&T) నుండి అధికారికంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం మరో నెల రోజుల సమయాన్ని పొడిగించింది. మార్చి 31తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ శుక్రవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఆర్థికపరమైన సర్దుబాట్లు, ముఖ్యంగా రుణాల బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.ఎల్ అండ్ టీకి ఉన్న సుమారు ₹13,000 కోట్ల అప్పును ప్రభుత్వం భరించాల్సి ఉంది.అప్పుతో పాటు సుమారు ₹2,000 కోట్ల ఈక్విటీని కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్ అండ్ టీ ప్రస్తుతం చెల్లిస్తున్న అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌ను సంప్రదించి సూత్రప్రాయ ఆమోదం పొందింది.మొత్తం ₹13,000 కోట్ల రుణంలో 75 శాతం జపాన్ యెన్ (Japanese Yen) రూపంలో, మిగిలిన 25 శాతం రూపాయల రూపంలో తీసుకోవాలని ప్రభుత్వం సవరించిన ప్రతిపాదనను పంపింది.ప్రస్తుతం ఎల్ అండ్ టీ సుమారు 10 శాతం వడ్డీ చెల్లిస్తుండగా, జపాన్ యెన్ రుణం ద్వారా వడ్డీ భారం 3 నుండి 4 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నిధుల విడుదల ప్రక్రియకు సమయం పడుతుందన్న కారణంతోనే గడువు పొడిగించారు.

మార్చి 28న శాసనసభలో ఆమోదించిన తీర్మానం ప్రకారం.. 69 కిలోమీటర్ల పొడవైన మెట్రో మొదటి దశను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోనుంది.ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోనుండగా, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఇకపై దీనిని ప్రభుత్వ సంస్థగా నిర్వహిస్తుంది.మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్ల ఫేజ్-II (సుమారు 162 కిలోమీటర్లు) విస్తరణ పనులు మరింత వేగంగా, సులభంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com