యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!

- April 07, 2026 , by Maagulf
యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!

యూఏఈ: క్రూరమైన ఇరాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా యుఏఈ తీసుకున్న వైఖరికి గల్ఫ్ అంతటా విస్తృత మద్దతు లభిస్తోందని యుఏఈ దౌత్యవేత్త, యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్ తెలిపారు. భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని ఉద్రిక్తతలు ప్రభావితం చేస్తున్న తరుణంలో యుద్ధంపై యూఏఈ తీసుకున్న దృఢమైన వైఖరి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు బలంగా తాకిందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ షేర్ చేశారు.   తాము కోరుకోని సంఘర్షణను నివారించేందుకు పొరుగు దేశాలు ప్రయత్నించినప్పటికీ, ఇరాన్ వారిపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాన్ ను నమ్మలేని ద్రోహపూరిత పాలనగా అభివర్ణించారు.

ప్రస్తుత తరుణంలో రాజకీయ వైఖరులలో స్పష్టత, నిజాయితీ అవసరమని, దేశాలు తమ ప్రజలను, సార్వభౌమాధికారాన్ని, విజయాలను ఎంత దృఢంగా కాపాడుకుంటాయనే దాని ఆధారంగానే వాటిని అంచనా వేస్తారని ఆయన అన్నారు. తాము ఈ సంఘర్షణలో భాగం కాదని, అదే సమయంలో జాతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకునే హక్కును కలిగి ఉన్నామని యూఏఈ పదేపదే తన వైఖరిని పునరుద్ఘాటిస్తోందని స్పష్టం చేశారు.

యూఏఈ భూభాగాన్ని ఉపయోగించలేదు

ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు యూఏఈలోని స్థావరాల నుంచే జరిగాయన్న ఇరాన్ వాదనలను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్-జనరల్ అబ్దుల్ నాసర్ అల్ హుమైదీ తోసిపుచ్చారు. "ఈ సంఘర్షణ మొదలైనప్పటి నుంచే యూఏఈ భూభాగాన్ని ఇరాన్‌పై ఎలాంటి దాడులకు ఉపయోగించబోమని, ఇకపైనా అలాగే కొనసాగిస్తామని యూఏఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది," అని ఆయన అన్నారు.

అరబ్ లీగ్ సమావేశం సందర్భంగా రాష్ట్ర మంత్రి ఖలీఫా బిన్ షహీన్ అల్ మరార్ మాట్లాడుతూ.. ప్రాంతీయ దేశాల పట్ల ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుత ప్రవర్తన మరియు వైఖరి దృష్ట్యా.. ఆ ప్రభుత్వంతో కలిసి జీవించడం అసాధ్యం అని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని, జవాబుదారీతనం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు మరింత పెరగడాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. కానీ ఈ ప్రాంతంలో మరింత ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టించే కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యే కాల్పుల విరమణను మేము కోరుకోవడం లేదని అన్నారు.   

అధికారులు ఉద్రిక్తతలను తగ్గించాలని, చర్చలు జరపాలని మరియు దౌత్యపరమైన పరిష్కారాలు కనుగొనాలని పదేపదే పిలుపునిచ్చారు.  అదే సమయంలో ఇరాన్‌ను జవాబుదారీగా చేయాల్సిన అవసరాన్ని కూడా తేల్చిచెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి మరియు డ్రోన్ కార్యక్రమాలు, వాణిజ్య మార్గాలకు మరియు నౌకాయాన స్వేచ్ఛకు ఇరాన్ ముప్పుగా మారిందని, వాటి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అల్ మరార్ తేల్చిచెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com