మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత

- April 16, 2026 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత

హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన మరియు క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కేసులు అధిక నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైనవిగా వైద్యులు తెలిపారు.

8 సంవత్సరాల బాలిక (బరువు: 21.2 కిలోలు) శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది. మెడ మరియు స్పైన్‌కు ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించగా, ఛాతి వెనుక భాగంలో 11.6 x 10.6 x 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి ప్రధాన రక్తనాళాలు, ముఖ్యంగా అయోర్టా, మరియు స్పైనల్ కాల్‌కు అత్యంత సమీపంగా ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.

ఈ కణితిని తొలగించకుండా వదిలేస్తే అది మరింత పెరిగి స్పైనల్ కార్డ్‌పై ఒత్తిడి పెంచి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ప్రధాన రక్తనాళాలపై ప్రభావం చూపి ప్రాణాపాయం కలిగించే అవకాశం కూడా ఉంది.

ఈ క్లిష్ట పరిస్థితిలో, డా.ప్రమోద్ రెడ్డి కందకురే (చీఫ్ కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్), న్యూరో సర్జన్ డా. అనీల్‌తో కలిసి శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 500 గ్రాముల కణితిని విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం బాలికలో ఎటువంటి నర సంబంధిత లోపాలు లేకుండా స్థిరంగా కోలుకుంటోంది. బయాప్సీ నివేదిక ప్రకారం ఇది “గ్యాంగ్లియోన్యూరోమా”గా నిర్ధారణ అయింది, ఇది కాన్సర్ కాని అరుదైన ట్యూమర్.

మరో కేసులో, 4 సంవత్సరాల బాలుడు పుట్టినప్పటి నుంచే పెదాలు, గోర్లు నీలం రంగులో కనిపించడం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షల్లో అతనికి “సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ” అనే అరుదైన గుండె లోపం ఉన్నట్లు గుర్తించారు. గుండె నాలుగు గదులుగా అభివృద్ధి చెందకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరైన స్థాయిలో చేరడం లేదు.

ఈ పరిస్థితికి చికిత్స అందించకపోతే బాలుడిలో ఆక్సిజన్ స్థాయిలు మరింత తగ్గిపోవడం, ఎదుగుదల మందగించడం, తీవ్రమైన గుండె సమస్యలు ఏర్పడడం వంటి ప్రాణాపాయకర పరిణామాలు కలగవచ్చు.

వైద్య బృందం బాలుడికి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం అతని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, శారీరక సామర్థ్యం పెరిగింది.

ఈ సందర్భంగా డా.ప్రమోద్ రెడ్డి కందకురే మాట్లాడుతూ, “ఈ రెండు కేసులు వైద్యపరంగా అత్యంత క్లిష్టమైనవి మరియు సమగ్ర ప్రణాళిక, ఖచ్చితత్వం అవసరమైనవి. మొదటి కేసులో కణితి స్పైనల్ కార్డ్ మరియు ప్రధాన రక్తనాళమైన అయోర్టాకు అత్యంత సమీపంలో ఉండటంతో శస్త్రచికిత్స ప్రతి దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పొరపాటు జరిగినా పక్షవాతం లేదా తీవ్రమైన రక్తస్రావం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.

అలాగే రెండో కేసులో ఉన్న సింగిల్ వెంట్రికల్ గుండె లోపం ప్రతి రోగిలో భిన్నంగా ఉండే సంక్లిష్ట సమస్య.ఈ రకమైన కేసుల్లో ఒకే విధమైన చికిత్స ఉండదు; రోగి శరీర నిర్మాణం, రక్తప్రసరణ విధానం ఆధారంగా వ్యక్తిగతంగా ప్రణాళిక సిద్ధం చేయాలి. శస్త్రచికిత్స ద్వారా శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం.

ఈ రెండు సందర్భాల్లోనూ మల్టీడిసిప్లినరీ టీమ్ సమన్వయం, ఆధునిక సాంకేతికత, మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందం వల్లే విజయవంతమైన ఫలితాలు సాధించగలిగాం. ముఖ్యంగా, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా త్వరగా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం,” అని తెలిపారు.

న్యూరో సర్జన్ డా.అనీల్ మాట్లాడుతూ,“స్పైనల్ కాల్‌కు సమీపంలో ఉన్న కణితులను తొలగించే సమయంలో నరాలను కాపాడటం అత్యంత ముఖ్యమైనది. సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం,” అని తెలిపారు.

సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నివారించవచ్చని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com