ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం

- April 17, 2026 , by Maagulf
ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు. అనిల్ చంద్ర పునేఠాను ఎస్‌ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం జీఓను విడుదల చేయనుంది. అనిల్ చంద్ర పునేఠా గతంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గవర్నర్ ఆమోదం లభించడంతో అనిల్ చంద్ర నియామకంపై త్వరలోనే అధికారిక జీఓ జారీ చేయనున్నారు. ఆ తర్వాత.. అనిల్ చంద్ర పునేఠాకు పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. SECగా అనిల్ చంద్ర నియామకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అనిల్ చంద్ర పునేఠా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయనకు రాష్ట్రంలో వివిధ కీలక శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వహించారు. జీఓ విడుదలైన వెంటనే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com