హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్

- April 17, 2026 , by Maagulf
హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్

టెహ్రాన్: ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఇరాన్ ఊరటనిచ్చే వార్త అందించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అధికారికంగా ప్రకటించారు.

లెబనాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు, హార్ముజ్ జలసంధి గుండా అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం విదేశాంగ మంత్రి ప్రకటన విడుదల చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల గత కొంతకాలంగా ఈ మార్గంలో నౌకల ప్రయాణంపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నిర్ణయంతో తెరపడింది.

హార్ముజ్ జలసంధిని తెరిచినప్పటికీ, ఇరాన్ కొన్ని కీలక షరతులను విధించింది. నౌకలు తమ దేశ ‘మారిటైమ్ ఆర్గనైజేషన్’ నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలని సూచించింది. లెబనాన్‌లో శాంతియుత వాతావరణాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ అక్కడ కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగితే, ఈ అనుమతులపై మళ్ళీ ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రపంచ చమురు వాణిజ్యంలో హార్ముజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైనది. మధ్య ప్రాచ్య దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురులో దాదాపు మూడో వంతు ఈ మార్గం గుండానే వెళుతుంది. ఇరాన్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా మెరుగుపడి, ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఎల్పీజీ మరియు ఇతర ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్న దేశాలకు ఇది నిజంగా ‘తియ్యని కబురు’ అని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com