పెట్టుబ‌డి ఒప్పందాలు వేగంగా అమ‌ల్లోకి రావాలి: సీఎం రేవంత్

- April 23, 2026 , by Maagulf
పెట్టుబ‌డి ఒప్పందాలు వేగంగా అమ‌ల్లోకి రావాలి: సీఎం రేవంత్

హైదరాబాద్: వివిధ వేదిక‌ల‌పై ప్ర‌ముఖ కంపెనీల‌తో కుదుర్చుకున్న అవ‌గాహ‌న ఒప్పందాలు (MOU) వేగంగా అమ‌ల్లోకి వ‌చ్చేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్ప‌టికే భూముల కేటాయింపుతో పాటు ఇత‌ర అనుమ‌తులు ఇచ్చిన కంపెనీలు త్వ‌ర‌గా ప‌నులు ప్రారంభించేలా చూడాల‌న్నారు. దావోస్‌, తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌తో పాటు ఇత‌ర వేదిక‌ల‌పై వివిధ సంస్థ‌ల‌తో కుదుర్చుకున్న ఎంవోయూల‌పై పురోగ‌తిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు బుధ‌వారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాలకు సంబంధించి ప‌నులు ప్రారంభ‌మైన కంపెనీలు...అనుమ‌తుల ద‌శ‌లో ఉన్న కంపెనీలు..సాంకేతిక‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో ప‌నులు పెండింగ్‌లో ఉన్న సంస్థ‌ల వివ‌రాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థ‌కు కేటాయించిన భూములు, అక్క‌డి మార్కెట్ ధ‌ర‌లు....ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆస‌క్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు వివ‌రించారు. ప్ర‌భుత్వ విధానం ప్ర‌కారం.. క్యూర్‌, ఫ్యూర్‌, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థ‌ల‌కు భూములు కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబ‌డుల‌కు సంబంధించిన అనుమ‌తులు వేగంగా ఇవ్వాల‌ని...అదే స‌మ‌యంలో ఆయా కంపెనీలు ప‌నులు త్వ‌ర‌గా ప్రారంభించేలా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సీఎం ఆదేశించారు. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల‌కు కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను సాధ్య‌మైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి వివ‌రాల‌ను ముందుగానే తెలుసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు.

డాటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవ‌కాశం ఉన్నందున అందుకు త‌గిన‌విధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పెట్టుబ‌డులుగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాల‌ని సీఎం సూచించారు. మ‌ల్టీనేష‌న‌ల్‌, మార్కెట్‌లో పేరు ప్ర‌తిష్ట‌లున్న కంపెనీల‌కు మొద‌టి ప్రాధాన్యం ఇచ్చి ఆయా సంస్థ‌లు త్వ‌ర‌గా ప‌నులు ప్రారంభించేలా చూడాల‌న్నారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భ‌విష్య‌త్ లోనూ మంచి ప్ర‌తిభ క‌న‌ప‌ర్చుతాయ‌నుకునే సంస్థ‌ల‌కు త‌ర్వాత ప్రాధాన్యం ఇవ్వాల‌ని, మిగ‌తా కంపెనీల‌ను మూడో ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబ‌డులు ప‌ట్టాలెక్కేలా ప్రేర‌ణ క‌ల్పించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. పెట్టుబ‌డుల సాధ‌న‌కు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న పోటీత‌త్వాన్ని అధికారులు గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అన్నారు. ఈ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌గా ఉండాల‌న్నారు..

ఫ్యూచ‌ర్ సిటీలో కార్యాల‌యం ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేసి అక్క‌డే ఎంవోయూల అమ‌లు, పురోగ‌తిపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌నులు పూర్త‌యిన కంపెనీల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించి వాటి ప్రారంభోత్స‌వానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం సూచించారు. ఎప్పుడెప్పుడు ఏ ఏ ఎంవోయూలు కుదుర్చుకున్నాం..అవి ఏ స్థితిలో ఉన్నాయి...అమ‌లుకు ఉన్న ఆటంకాలు... వాటి పెట్టుబ‌డి... క‌ల్పించే ఉద్యోగాలు.. ఇలా ప్ర‌తి అంశం సీఎంవో, ఆయా శాఖ‌ల మంత్రులు తెలుసుకునేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని.. దానిలో రియ‌ల్ టైం అప్‌డేట్ ఉండాల‌ని సీఎం ఆదేశించారు....

పెట్టుబడుల‌కు సంబంధించి ఒక పూర్తి స్థాయి మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒక సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఆధ్వ‌ర్యంలో అది ప‌ని చేసేలా చూడాల‌న్నారు.టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ ట‌వ‌ర్లలో కొన‌సాగుతున్న కార్య‌క‌లాపాల‌పై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. ఆయా ట‌వ‌ర్ల‌ను పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సీఎం సూచించారు. ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ రంగాల‌కు సంబంధించి జైకా నిధుల‌తో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పైనా ముఖ్య‌మంత్రి స‌మీక్షించారు. ఆయా ప‌నుల‌కు సంబంధించి అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె.శ‌శాంక‌, రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి భ‌వేష్ మిశ్రా, ప‌రిశ్ర‌మ‌ల శాఖ డైరెక్ట‌ర్ నిఖిల్ చ‌క్ర‌వ‌ర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో ప‌నుల‌కు సంబంధించి మిగిలిన కొంత భూ సేక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌పై స‌మీక్ష‌కు ముందు హైద‌రాబాద్ మెట్రో రైలు ప‌నుల‌పై సీఎం స‌మీక్షించారు. రెండేళ్ల‌లోనే చాంద్రాయ‌ణ‌గుట్ట వ‌ర‌కు మెట్రో రైలు ప‌నులు పూర్తి కావాల‌ని ఆదేశించారు. రెండో ద‌శ మెట్రో అనుమ‌తులు, బ‌హ‌దూర్‌గూడ వ‌ద్ద హైస్పీడ్ కారిడార్ వ‌ద్ద‌కు మెట్రో విస్త‌ర‌ణ అంశాల‌పైనా చ‌ర్చించారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్‌, మెట్రో స‌ల‌హాదారు ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com