తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- April 28, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ (DGP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ప్రస్తుత డీజీపీ స్థానంలో ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. 1991 బ్యాచ్కు చెందిన ఈ సీనియర్ అధికారికి మంచి గుర్తింపు ఉంది.
సీవీ ఆనంద్ తన సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక పదవులను అధిష్టించారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా ఆయన చేసిన సేవలు, పరిష్కరించిన కేసుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ఆయన వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టారు. గతంలో ఆయన సైబరాబాద్ కమిషనర్గా, ఇతర కీలక పదవుల్లో పనిచేశారు.
ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపించింది. దీనిలో సీవీ ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఇందులో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్ను డీజీపీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీవీ ఆనంద్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల నిర్వహణలో కఠినంగా ఉంటూనే, ప్రజలకు చేరువయ్యేలా పోలీసింగ్ ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది. సీవీ ఆనంద్ నియామకంతో పోలీస్ శాఖలో మరిన్ని సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కొత్త డీజీపీ సీవీ ఆనంద్ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ అయిపోయాయి. వీటి కట్టడికి సీవీ ఆనంద్ చర్యలు తీసుకోవాలి, పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రణాళికలు వేయాలి. మత్తు పదార్థాల నిర్మూలనపై కూడా ఉక్కుపాదం మోపాలి. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘాను పెంచాలి.
సమర్థవంతమైన అధికారిగా పేరున్న సీవీ ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత కొత్త నిర్ణయాలతో పనిచేస్తుందని పోలీస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సీవీ ఆనంద్ నియామకం పట్ల పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!









