ప్ర‌తాప్ హాస్పిట‌ల్‌లో గ్ర‌హ‌ణ‌మొర్రికి ఉచితంగా శస్త్ర‌చికిత్స‌లు: డాక్ట‌ర్ ప్ర‌తాప్

- May 04, 2026 , by Maagulf
ప్ర‌తాప్ హాస్పిట‌ల్‌లో గ్ర‌హ‌ణ‌మొర్రికి ఉచితంగా శస్త్ర‌చికిత్స‌లు: డాక్ట‌ర్ ప్ర‌తాప్

విజ‌య‌వాడ‌: గ్రహణమొర్రి అనేది పుట్టుకతో వచ్చే ఒక శారీరక లోపం. గ్ర‌హ‌ణమొర్రితో పుట్టిన పిల్ల‌లు నేటి కాలంలో చాలా మందిలో ర‌కర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. కొంత మందికి సులువైన వైద్యం చేయించుకునే అవ‌కాశం ఉండ‌దు. ఈ నేప‌ధ్యంలో గ్ర‌హ‌ణ‌మొర్రి లోపంతో ఉన్న‌వారికి త‌మ ఆసుప్ర‌తిలో ఉచితంగా శస్త్ర‌చికిత్స‌లు చేయ‌డంతో పాటు వ‌స‌తి సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తామ‌ని ఈ అవ‌కాశాన్ని గ్ర‌హ‌ణ‌మొర్రి బాధితులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్ర‌తాప్ హాస్పిట‌ల్ (ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ స‌ర్జ‌రీ ఇన్‌స్టిట్యూట్‌) అధినేత‌, ప్ర‌ముఖ ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ప్ర‌తాప్ దుగ్గిరాల తెలిపారు. ఈ విష‌య‌మై న‌గ‌రంలోని మ‌హానాడు రోడ్డులో ఉన్న ప్ర‌తాప్ హాస్పిట‌ల్‌లో సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ ప్ర‌తాప్ దుగ్గిరాల మాట్లాడుతూ, గ్రహణమొర్రి శస్త్రచికిత్స ఎంత తొందరగా చేయించుకొంటే అంత మంచిదని చెప్పారు. ప్ర‌తాప్ హాస్పిట‌ల్ స్థాపించి 10ఏళ్ళు పూర్తైన సంద‌ర్భంగా ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో పాటు వేలాది రూపాయ‌లు ఖ‌ర్చుతో కూడిన గ్ర‌హ‌ణ‌మొర్రి చికిత్స‌ల‌ను ఇక‌పై త‌మ ఆసుప‌త్రిలో 365 రోజుల‌పాటు ఉచితంగా నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. గ్ర‌హ‌ణ‌మొర్రి లోపం ఉన్న‌వారికి పెదాలు చీలడం, నోటిలోని కొండ‌నాలుక భాగంలో రెండుగా చీలిపోవ‌డం(చీలిక అంగిలి) వంటివి జ‌రుగుతాయ‌న్నారు.

ప్ర‌తి వెయ్యి మందిలో గ్ర‌హ‌ణమొర్రి లోపంతో ఒక‌రుంటార‌ని, వంశ‌పార‌ప‌ర్యంగా కూడా ఈ లోపం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ లోపంతో పుట్టిన‌వారికి మూడు నెల‌ల వ‌య‌సు దాటాక పెదానికి, తొమ్మిది నెల‌లు వ‌య‌సు దాటాక చీలిక అంగిలి(కొండ నాలుక‌)కి శ‌స్త్ర‌చికిత్స చేస్తామ‌ని పేర్కొన్నారు. గ్ర‌హ‌ణ‌మొర్రి లోపంతో ఉన్న‌వారు శ‌స్త్ర‌చికిత్స చేయించుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే భ‌విష్య‌త్తులో మాట్లాడే విధానంలోనూ, దంతాల మ‌ధ్య‌న తేడా వ‌స్తుంద‌ని, వినికిడి స‌మ‌స్య‌, చెవిలో చీము ప‌ట్ట‌డం వంటి లక్ష‌ణాలు ఏర్ప‌డ‌తాయ‌న్నారు. అఖిల‌భార‌త మ‌హిళా సేవా స‌మాజ‌ స‌హ‌కారంతో ఈ శ‌స్త్ర‌చికిత్స‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. గ్ర‌హ‌ణ‌మొర్రి బాధితులు దేశంలో ఎక్క‌డివారైనా స‌రే త‌మ ఆసుప‌త్రిలో ఉచితంగా శ‌స్త్ర‌చికిత్స‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక శ‌స్త్ర‌చికిత్స‌కు సంబంధించి సుమారు రూ.75 వేలు ఖ‌ర్చుతో ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా బాధితులు నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక‌పై గ్ర‌హ‌ణ‌మొర్రి శ‌స్త్ర‌చికిత్స‌లు ఉచితంగా చేస్తామ‌ని డాక్ట‌ర్ ప్ర‌తాప్ స్ప‌ష్టం చేశారు. త‌మ‌ హాస్పిట‌ల్ స్థాపించిన నాటి నుండి నేటి వ‌ర‌కు గ్ర‌హ‌ణ‌మొర్రికి సంబంధించి వేలాది శ‌స్త్ర‌చికిత్స‌లు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. గ్ర‌హ‌ణ‌మొర్రితో బాధ‌ప‌డుతూ శ‌స్త్ర‌చికిత్స అవ‌స‌రం ఉన్న‌వారు ఇత‌ర వివ‌రాల‌కు త‌మ ఆసుప‌త్రి కోఆర్డినేట‌ర్‌ను 8712022521 ఫోన్ నంబ‌రులో సంప్ర‌దించాల‌ని కోరారు. విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ వ‌డ్ల‌ముడి ముర‌ళీకృష్ణ‌, డాక్ట‌ర్ దుగ్గిరాల స్వాతి, డాక్ట‌ర్ శైల‌జ‌, డాక్ట‌ర్ పృద్విని కొల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com