భగీరథ్ కు 14 రోజుల రిమాండ్..చర్లపల్లి జైలుకు తరలింపు
- May 17, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన బండి భగీరథ్కు మేడ్చల్ కోర్టు ఈనెల 29 వరకు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు.. అంతకుముందు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ను సుమారు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, భారీ భద్రత నడుమ మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు డైరీని, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడంతో, పోలీసులు అతడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
స్వచ్ఛందంగానే పోలీసులకు అప్పగించామన్న లాయర్!
ఈ అరెస్ట్ వ్యవహారంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బండి భగీరథ్ తరఫు న్యాయవాది కరుణాసాగర్ కోర్టు పరిసరాల్లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, అందుకే భగీరథ్ను స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. నిందితుడు ఎక్కడికీ పారిపోలేదని, పోలీసుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాడని స్పష్టం చేశారు. రాజకీయ లేదా ఇతర కారణాల వల్ల ఈ కేసులో ఏవైనా కోణాలు ఉన్నాయా అనేది విచారణలో తేలుతుందని, తమ క్లయింట్ నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
చర్లపల్లి జైల్లో భారీ బందోబస్తు
కోర్టు రిమాండ్ విధించిన వెంటనే పోలీసులు ఎలాంటి ఆలస్యం చేయకుండా భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, పోక్సో చట్టం కింద నమోదైన కేసు కావడంతో సిట్ అధికారులు మరింత లోతుగా ఆధారాలను సేకరిస్తున్నారు. విచారణలో భగీరథ్ చెప్పిన వివరాలను, బాధితుల స్టేట్మెంట్లను సరిపోల్చే పనిలో పడ్డారు. రాబోయే రోజుల్లో కేసు తీవ్రతను బట్టి నిందితుడిని మరింత సమాచారం కోసం పోలీస్ కస్టడీకి కోరే అవకాశం కూడా ఉందని లీగల్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







