టీజీ వెంకటేష్ జన్మదినం సందర్భంగా 60 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు
- May 17, 2026
ప్రజాసేవ చేస్తూనే ఉంటాం: మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు: కర్నూలు నగరంలోని మౌర్య ఇన్లో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని 60 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రతి జంటకు రూ.80 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఇప్పటికే నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు, కాలి మెట్టెలు, బంగారు తాళిబొట్లు కూడా పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజాసేవలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు వివాహాలు నిర్వహించడం ఆర్థికంగా భారమవుతోందని, ఆ బాధను తగ్గించేందుకు ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నూతన వధూవరులు దురలవాట్లకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కర్నూలు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తలసేమియా బాధితుల కోసం రూ.1 కోటి విరాళంతో భవనం నిర్మిస్తున్నామని వెల్లడించారు.
కర్నూలు అభివృద్ధికి టీజీ వెంకటేష్ ఎంతో కృషి చేశారని, ఆయన బాటలోనే తాను కూడా ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు. తన తండ్రి చేసిన అభివృద్ధికంటే మరింతగా కర్నూలును అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆలోచన తమకు లేదని, తాము వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. ఎలాంటి ఆదాయం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి అక్రమంగా డబ్బులు సంపాదించే వారే ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు.
ప్రజలు పుకార్లను నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని మంత్రి టీజీ భరత్ గుప్తా కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







