2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- May 18, 2026
యూఏఈ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీతాల చెల్లింపులపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ (WPS) కింద దేశవ్యాప్తంగా జీతాల చెల్లింపుకు ఒకే విధమైన గడువును నిర్ణయిస్తూ యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి గ్రెగోరియన్ నెల మొదటి తేదీన గత నెల జీతాలను ఉద్యోగులకు చెల్లించాలి. ఆ తేదీ తర్వాత చెల్లింపులు జరిగితే అవి ఆలస్యంగా చెల్లించినట్లుగా పరిగణించబడతాయి. ఈ నిర్ణయాన్ని మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (Mohre) జారీ చేసిన మంత్రిత్వ తీర్మానం ఆధారంగా అమలు చేస్తున్నారు.
ప్రైవేట్ రంగ సంస్థలు అన్ని జీతాలను అధికారిక వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇతర చెల్లింపు మార్గాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు చెల్లించినట్లు రికార్డులు, పత్రాలు సమర్పించడం కూడా సంస్థలకు తప్పనిసరి.
85 శాతం జీతం చెల్లిస్తేనే అనుగుణత
కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం వేతనాల్లో కనీసం 85 శాతం గడువులోపు చెల్లిస్తేనే సంస్థ నిబంధనలు పాటించినట్లుగా పరిగణిస్తారు. చట్టబద్ధమైన కోతలు లేదా నిలుపుదలల కారణంగా మిగిలిన మొత్తం చెల్లించకపోయినా, ఉద్యోగి జీతం పొందినట్లుగానే పరిగణిస్తారు. అయితే మిగిలిన బకాయిలను ఉద్యోగి క్లెయిమ్ చేసుకునే హక్కు కొనసాగుతుంది.
జీతాల ఆలస్యం పై కఠిన చర్యలు
- గడువులోపు జీతాలు చెల్లించని సంస్థల పై దశలవారీగా చర్యలు తీసుకోనున్నారు.
- గడువు దాటిన రెండో రోజు నుంచే సంస్థలకు హెచ్చరికలు పంపిస్తారు.
- ఐదో రోజు నుంచి కొత్త వర్క్ పర్మిట్ల జారీ నిలిపివేస్తారు.
- 11వ రోజు తర్వాత కూడా జీతాలు చెల్లించకపోతే పరిపాలనా జరిమానాలు విధించడంతో పాటు సంస్థను మూడో కేటగిరీకి డౌన్గ్రేడ్ చేస్తారు.
- 16వ రోజు తర్వాత ఉద్యోగుల తరఫున లేబర్ వివాదాలను స్వయంచాలకంగా నమోదు చేస్తారు.
- 21వ రోజు తర్వాత కంపెనీపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి, అవసరమైతే యజమానిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించవచ్చు.
రెండు నెలలు వరుసగా ఉల్లంఘనలు చేసిన 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కూడా పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణ, రవాణా, భద్రత, క్లీనింగ్, రిక్రూట్మెంట్ రంగాలపై ఈ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి.
WPS నుంచి మినహాయింపులు
కొన్ని వర్గాల ఉద్యోగులు, సంస్థలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. కోర్టులో వేతన వివాదాలు ఉన్న ఉద్యోగులు, పరారైనట్లు నమోదైన కార్మికులు, చట్టపరమైన నిర్బంధంలో ఉన్నవారు, అనుమతితో జీతం లేని సెలవులో ఉన్నవారు ఈ పరిధిలోకి రారు.
అలాగే విదేశీ సంస్థల ఉద్యోగులు, సముద్ర కార్మికులు, మూడు నెలల వరకు తాత్కాలిక మిషన్ పర్మిట్పై పనిచేసేవారు, వ్యక్తిగత యాజమాన్యంలోని ఫిషింగ్ బోట్లు, పబ్లిక్ టాక్సీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రార్థనా మందిరాలకు కూడా మినహాయింపులు ఉంటాయి.
ఈ కొత్త విధానం ద్వారా జీతాల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో పాటు ఉద్యోగుల హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని యూఏఈ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









