రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి

- May 21, 2026 , by Maagulf
రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

21వ శతాబ్దంలో దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు నడిపించి కొత్త దిశా నిర్దేశం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం కొనియాడారు. దేశ యువతను సాంకేతిక యుగానికి సిద్ధం చేసిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ వంటి మహానేతల స్ఫూర్తితో రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. టెలికాం, కంప్యూటర్ రంగాల్లో ఆధునిక సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆయన, పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెరగాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు.

లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి చిక్కుముడులు లేకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రిని కోరారు.

తెలంగాణతో ఇందిరాగాంధీ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సీఎం తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com