ఇండియాలో ఎబోలా అలర్ట్..

- May 21, 2026 , by Maagulf
ఇండియాలో ఎబోలా అలర్ట్..

న్యూ ఢిల్లీ:  ఎబోలా ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది. ఆఫ్రికాలో ఇటీవల మళ్లీ మొదలైన ఎబోలా అక్కడ క్రమంగా విస్తరిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగో, ఉగాండాలలో ఎబోలా ప్రమాదకర స్థాయికి చేరడంతో అక్కడ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించకుండా చూడాలని, ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డీజీహెచ్‌ఎస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్) అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి.. ముఖ్యంగా ఎబోలా అత్యధికంగా వ్యాపిస్తున్న కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించింది.

ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా ఎబోలా లక్షణాలు ఉంటే వెంటనే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, రక్తస్రావం వంటివి ఉంటే ఎయిర్‌‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్లకు చెబుతున్నారు. వారిని ప్రత్యేకంగా ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య స్తితిపై పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా ఇలాంటి అనారోగ్య లక్షణాలు 21 రోజుల్లోపు వస్తే.. వెంటనే తమకు తెలియజేయాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు ఇటీవలి కాలంలో ఏయే దేశాలు తిరిగారో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా విదేశాల నుంచి ఇండియాకు ఎబోలా రాకుండా చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com