ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష

- May 21, 2026 , by Maagulf
ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష

దుబాయ్: ఈద్ అల్ అధా పండుగను పురస్కరించుకుని దుబాయ్ రూలర్, యూఏఈ ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 836 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ జాతీయతలకు చెందిన ఈ ఖైదీలు దుబాయ్‌లోని సవరణ మరియు శిక్షా కేంద్రాల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ విషయాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ చాన్సలర్ ఎస్సామ్ ఈసా అల్ హుమైదాన్ వెల్లడించారు. షేక్ మొహమ్మద్ తీసుకున్న ఈ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, వారికి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేందుకు ఖైదీలకు మరో అవకాశం ఇవ్వాలనే దయా దాక్షిణ్యంతో ఈ క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నారని అల్ హుమైదాన్ తెలిపారు.

షేక్ మొహమ్మద్ ఆదేశాల అమలుకు సంబంధించి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసులతో కలిసి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రతి ఏడాది రమదాన్, ఈద్ వంటి ముఖ్యమైన సందర్భాల్లో యూఏఈ నాయకత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని ద్వారా ఖైదీలకు కొత్త ఆరంభానికి అవకాశం కల్పించడంతో పాటు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com