తెలంగాణ విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థల చేయూత
- May 24, 2026
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు అందించనున్న రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు విద్యాశాఖతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రాంకీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఒప్పందాల ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతులతో కూడిన కొత్త విద్యా ప్రాంగణ నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయంలో 40 శాతం, అంటే రూ.19.66 కోట్లను రాంకీ సంస్థ భరించనుంది.
అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయంలో 40 శాతం, అంటే రూ.10.4 కోట్లను కూడా రాంకీ సంస్థ అందించనుంది.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల నిర్మాణానికి అవసరమైన రూ.50.50 కోట్ల మొత్తాన్ని రహేజా గ్రూప్ భరించనుంది.
ఇక మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ, 6వ మరియు 7వ తరగతుల అభివృద్ధికి అవసరమైన రూ.12.20 కోట్లను యశోదా హాస్పిటల్స్ అందించనున్నాయి.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం విద్యారంగానికి ఊతమిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







