ప్రొఫెసర్ నాగేశ్వర్‌ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత

- May 26, 2026 , by Maagulf
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత

హైదరాబాద్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు నమోదు చేసిన కేసులపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను జనసేన పార్టీ, ఏపీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని కవిత ఆరోపించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విశ్లేషణలు చేసే మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయనపై కావాలనే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. తెలుగు సమాజం ఎంతో గౌరవించే ఒక విద్యావేత్తపై ఇలాంటి కుట్రలు చేయడం దుర్మార్గం. ఒకవేళ హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఏపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కవిత స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటనను ఆమె ప్రస్తావించారు. భద్రాచలంలో వడదెబ్బతో మరణించిన ఒక నిరుపేద కుటుంబానికి మార్చురీ వాహనం (అంబులెన్స్) నిరాకరించడంపై ఆమె మండిపడ్డారు. వాహనం లేకపోవడంతో మృతుడి బంధువులు శవాన్ని కిలోమీటరుకు పైగా భుజాలపై మోసుకెళ్లాల్సి రావడం కలచివేసిందన్నారు. ఈ ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ అమానవీయతకు, పేదల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com