‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా

- May 29, 2026 , by Maagulf
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం ద్వారా రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి మరింత బలోపేతమవుతోందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలకు దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగిందని, దీంతో ఆ రాష్ట్రాలు దేశంలోని మిగతా ప్రాంతాలకు సాంస్కృతికంగా మరింత చేరువయ్యాయని పేర్కొన్నారు.

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్–యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలపై పరస్పర అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. యువత దేశ సమైక్యత, జాతీయ సమగ్రత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి అంశాలపై అధికారులు వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్, సునీల్ కుమార్, కో-నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ పెరుగు శ్యామ్, నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన ఎన్‌ఎస్‌జీ గ్రూప్ కమాండర్

ఇదిలా ఉండగా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) ముంబై 28 స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ (ఎస్‌సీజీ) గ్రూప్ కమాండర్ కల్నల్ అభిషేక్ సింగ్ కూడా గురువారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com