సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు

- July 14, 2026 , by Maagulf
సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు

హైదరాబాద్: మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ, సురక్షిత సమాజ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. "మీ సురక్ష – సహచరి" కార్యక్రమంలో భాగంగా నాగోల్‌లోని శుభమ్ కన్వెన్షన్‌లో ఎల్.బి. నగర్, ఉప్పల్ జోన్‌లకు చెందిన స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, మహిళలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, పోలీస్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకునే విధానాలపై సమగ్రంగా వివరించారు.

మహిళలు ఎదుర్కొనే సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఆర్థిక నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో, అనుమానాస్పద సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. అలాగే మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, అత్యవసర సహాయ వ్యవస్థలు, ఫిర్యాదు నమోదు ప్రక్రియపై కూడా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ, మహిళల భద్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ ధైర్యంగా, సురక్షితంగా జీవించే వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులతో పంచుకోవాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్ సేవలను వినియోగించాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాల నివారణకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. మహిళల్లో అవగాహన పెంపొందించి, భద్రతా చైతన్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com