ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- July 14, 2026
మనామా: ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తరఫున గూఢచర్యం చేసి, బహ్రెయిన్కు వ్యతిరేకంగా శత్రుత్వ కార్యకలాపాలకు సహకరించిన ఆరోపణలపై ముగ్గురు నిందితులకు బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ ముగ్గురిపై నమోదైన రెండు వేర్వేరు కేసుల్లో విచారణ పూర్తయ్యాక కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే దేశం విడిచి పారిపోయి, భద్రతా కారణాలతో వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అతడు బహ్రెయిన్లో ఉన్న మరో వ్యక్తిని తన కోసం పనిచేయడానికి ప్రేరేపించి, దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపించాలని ఆదేశించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ సమాచారాన్ని ఇరాన్ దాడులకు వినియోగించాలనే ఉద్దేశంతో సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
రెండో కేసులో మరో నిందితుడు IRGCకు అనుబంధంగా ఉన్న ఆన్లైన్ ఖాతాతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. బహ్రెయిన్లోని కీలక స్థావరాలపై జరిగిన ఇరాన్ దాడులకు సంబంధించిన వీడియోలను పంపడంతో పాటు, దేశంలోని కీలక ప్రాంతాల భౌగోళిక కోఆర్డినేట్లను కూడా పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బహ్రెయిన్ ప్రజల ప్రాణాలకు, దేశ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఈ రెండు కేసులపై ఫిర్యాదులు అందిన వెంటనే బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. దేశంలో ఉన్న ఇద్దరు నిందితులను విచారించడం, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం, స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను సాంకేతిక నిపుణులతో పరిశీలించడం వంటి చర్యలు చేపట్టింది.
దర్యాప్తులో నిందితులు IRGCకు అందించిన సమాచారం, డేటా ఆధారంగానే బహ్రెయిన్లోని అనేక కీలక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ స్థావరాలపై ఇరాన్ శత్రుత్వ దాడులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ చర్యలు దేశ భద్రత, శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పు కలిగించాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
దీంతో నిందితులను హై క్రిమినల్ కోర్టుకు హాజరుపరిచారు. అన్ని చట్టపరమైన విధానాలు పాటిస్తూ, నిందితులకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించిన అనంతరం కోర్టు ముగ్గురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
జూలైలో బహ్రెయిన్ పై ఇరాన్ దాడులు
జూలై నెలలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో బహ్రెయిన్ పలుమార్లు క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొంది. జూలై 8న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా, బహ్రెయిన్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. బహ్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులు, డ్రోన్లను లక్ష్యాలను చేరకముందే విజయవంతంగా కూల్చివేసినట్లు రక్షణ దళాలు ప్రకటించాయి.
గత రెండు రోజులుగా కూడా ఇరాన్ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగించడంతో బహ్రెయిన్ జాతీయ హెచ్చరిక వ్యవస్థను పలుమార్లు అమలు చేసింది. దేశ గగనతలంలోకి ప్రవేశించిన మరిన్ని క్షిపణులు, డ్రోన్లను వైమానిక రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు సైన్యం వెల్లడించింది.
మంగళవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలువురు శత్రుత్వ వైమానిక దాడులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో పౌరులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపించింది.
మరోవైపు, అమెరికా ఇరాన్పై చేపట్టిన దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేపట్టినట్లు కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







