యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..

- June 08, 2026 , by Maagulf
యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..

అబుదాబి: యూఏఈలో తీవ్ర వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఏడాది అమలు చేసే ‘మిడ్‌డే బ్రేక్’ (మధ్యాహ్న విరామం) విధానం ఈ ఏడాది కూడా అమల్లోకి రానుంది. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో, నేరుగా సూర్యరశ్మిలో పని చేయడాన్ని నిషేధిస్తూ మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది.

ఆక్యుపేషనల్ హీట్ స్ట్రెస్ ప్రివెన్షన్ పాలసీగా అధికారికంగా పిలువబడే ఈ కార్యక్రమం 2026లో వరుసగా 22వ ఏడాది అమలు కానుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్మికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను నివారించడమే దీని ప్రధాన ఉద్దేశం.

కొన్ని పనులకు మినహాయింపులు

అయితే ప్రజా ప్రయోజనం లేదా సాంకేతిక కారణాల దృష్ట్యా నిరంతరాయంగా కొనసాగాల్సిన కొన్ని పనులకు ఈ నిషేధం వర్తించదు. ముఖ్యంగా:

  • రహదారుల పై తారు (అస్ఫాల్ట్) పరచడం
  • కాంక్రీట్ పోయడం వంటి మధ్యలో నిలిపివేయలేని నిర్మాణ పనులు
  • నీటి సరఫరా, విద్యుత్ సేవలు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన అత్యవసర మరమ్మతులు
  • ప్రజా జీవనం, రవాణా పై ప్రభావం చూపే ప్రభుత్వ అనుమతులతో నిర్వహించే పనులు

వంటి కార్యకలాపాలకు మినహాయింపు కల్పించబడింది.

యజమానులకు ప్రత్యేక ఆదేశాలు

మినహాయింపు పొందిన పనులు నిర్వహించే సంస్థలు కార్మికులకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగా:

  • నీడ కల్పించే విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేయడం
  • ఫ్యాన్లు వంటి శీతలీకరణ పరికరాలు అందుబాటులో ఉంచడం
  • తగినంత తాగునీరు సరఫరా చేయడం
  • ఉప్పు పదార్థాలు, ఇతర హైడ్రేషన్ సప్లిమెంట్లు అందించడం
  • విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం
  • ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) పరికరాలు సిద్ధంగా ఉంచడం

తప్పనిసరి అని పేర్కొంది.

పర్యవేక్షణకు డిజిటల్ వ్యవస్థలు

మిడ్‌డే బ్రేక్ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు స్మార్ట్ డిజిటల్ టూల్స్, క్షేత్రస్థాయి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు MoHRE తెలిపింది. కార్మికులను వేడి ప్రభావం నుంచి రక్షించడం, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఉత్పాదకతను కూడా కొనసాగించడం ఈ విధానం లక్ష్యమని పేర్కొంది.

99 శాతానికి పైగా అనుసరణ

MoHREలో లేబర్ ప్రొటెక్షన్ అసిస్టెంట్ అండర్‌సెక్రటరీ దలాల్ అల్ షెహీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా సంస్థలు 99 శాతానికి పైగా నిబంధనలను పాటిస్తున్నాయని తెలిపారు. మిడ్‌డే బ్రేక్ సమయంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయని చెప్పారు.

ఉల్లంఘనల పై ఫిర్యాదులు

మధ్యాహ్న విరామ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు లేదా అసురక్షిత పనులపై ప్రజలు 
MoHRE కాల్ సెంటర్ 600590000, 
మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా 
స్మార్ట్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com