ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!

- July 26, 2026 , by Maagulf
ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!

కువైట్ సిటీ: కువైట్ లో ఉగ్రవాద ముఠాను భద్రతా బలగాలు పట్టుకున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) ఖండించింది. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్న ఈ సమాచారం అధికారిక వర్గాల నుంచి విడుదలైనది కాదని స్పష్టం చేసింది.

జాతీయ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని హోంశాఖ తెలిపింది. ఉగ్రవాదం లేదా ఇతర భద్రతా అంశాలకు సంబంధించిన ఏదైనా కేసు వెలుగులోకి వస్తే, దేశంలో అమలులో ఉన్న విధి విధానాల ప్రకారం అధికారిక మార్గాల ద్వారానే ప్రజలకు తెలియజేస్తామని పేర్కొంది.

ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారమైన మరో వార్తపైనా హోంశాఖ వివరణ ఇచ్చింది. ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న అన్ని వాహనాలను సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా ఎగ్జిట్ అనుమతి ఇవ్వడం లేదన్న వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు కేవలం కోర్టు ఆదేశాలతో లేదా ముందస్తు జప్తు (Impoundment) కింద ఉన్న వాహనాలు, అలాగే ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. ట్రాఫిక్ జరిమానాలు బకాయి ఉన్న వాహనాలకు ఈ నిబంధన వర్తించదని వెల్లడించింది.

అలాగే, కువైట్ పౌరులు దేశం విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ జరిమానాలు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే రెసిడెంట్లు దేశం విడిచి వెళ్లే ముందు తమపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలను చెల్లించడం తప్పనిసరి అని, ఇది అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారమే కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని హోంశాఖ సూచించింది. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే తప్పుడు వార్తలు, వదంతులను ప్రచారం చేయడం లేదా షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని హోంశాఖ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com