నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ సీవీ ఆనంద్

- June 10, 2026 , by Maagulf
నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఇక పై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే మాటకు తావులేదని, నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఉక్కుపాదం మోపుతామని ఆయన తేల్చిచెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణ, పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన మరియు పోలీస్ విభాగాల పునర్వ్యవస్థీకరణపై పలు కీలక ప్రకటనలు చేశారు. మారుతున్న కాలం, సమాజ అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సైబర్, నార్కోటిక్స్ విభాగాల్లోకి సిబ్బంది

తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమొందిందని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో పోరాడేందుకు గతంలో ఏర్పాటైన ఎలైట్ ఫోర్స్ ‘గ్రేహౌండ్స్’ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్‌కు చెందిన సుమారు 1700 మంది సిబ్బందిని, ప్రస్తుతం రాష్ట్రానికి అత్యంత సవాలుగా మారిన సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ (మత్తుపదార్థాల నియంత్రణ) వంటి అత్యవసర విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో కొత్త తరహా నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

డ్రగ్స్, గంజాయి మహమ్మారి పై యుద్ధం

యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై తెలంగాణ పోలీస్ శాఖ యుద్ధం ప్రకటిస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలను పూర్తిగా అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేసే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేలా అత్యాధునిక శిక్షణ

టెక్నాలజీని వాడుకుంటూ అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని డీజీపీ వివరించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుగా పోలీస్ సిబ్బందికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సైబర్ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

స్థానికంగా శాంతిభద్రతలను కాపాడటంలో, క్షేత్రస్థాయిలో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులను డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన జిల్లాలు కూడా ఇదే తరహా పట్టుదలతో పనిచేసి రాష్ట్రంలో నేరాల శాతాన్ని తగ్గించాలని, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com