సూడాన్‌లో డ్రోన్‌ దాడిలో 15 మంది మృత్యువాత..

- June 12, 2026 , by Maagulf
సూడాన్‌లో డ్రోన్‌ దాడిలో 15 మంది మృత్యువాత..

ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో అంతర్యుద్ధం రోజురోజుకూ మరింత భీభత్సంగా మారుతోంది. అధికారం కోసం అక్కడి అధికారిక సైన్యం (Sudanese Army), పారా మిలటరీ దళాల (RSF) మధ్య మూడేళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరులో ఏ పాపమూ తెలియని సామాన్య ప్రజలు బలైపోతున్నారు. తాజాగా బుధవారం రాత్రి సూడాన్‌లోని ఎల్‌ ఒబెయిద్‌ నగరంలో జరిగిన భీకర డ్రోన్‌ దాడులు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘోర దాడిలో కనీసం 15 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డజన్ల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

మానవత్వం లేని దాడులు.. టార్గెట్ అయిన శ్మశాన వాటికలు, ఆహార ట్రక్కులు

ఈ డ్రోన్ దాడులు ఎంత ఘోరంగా జరిగాయంటే.. సైనిక స్థావరాలతో పాటు సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని ఒక గ్యాస్‌ స్టేషన్‌, నిత్యావసరాలు తీసుకెళ్తున్న ఆహార ట్రక్కుపై డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి.అంతటితో ఆగకుండా, మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించే శ్మశాన వాటిక వద్ద ఉన్న ప్రజలపై కూడా దాడులు జరగడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించగా, వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

స్తంభించిన ప్రజాజీవనం..మూడేళ్లలో 60 వేల మంది బలి!

ఈ తాజా దాడుల భయంతో ఎల్‌ ఒబెయిద్‌ నగరంలో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రోన్లు వచ్చి దాడి చేస్తాయో తెలియని ఆందోళనలో ప్రజలు బతుకుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేశారు. వ్యాపార సముదాయాలు, మార్కెట్లు పాక్షికంగా మాత్రమే తెరుచుకుంటున్నాయి. గత మూడేళ్లుగా సూడాన్‌లో సాగుతున్న ఈ రక్తపాత అంతర్యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 60,000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నా అక్కడ శాంతి స్థాపన అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com