ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా

- June 14, 2026 , by Maagulf
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం తోడవ్వడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భానుడు ప్రతాపం చూపిస్తుండగానే, మరోవైపు అకాల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలకరిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా, రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

తెలంగాణలోని ఈ జిల్లాలకు అలర్ట్..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్ష సూచన ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హైఅలర్ట్‌గా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల హెచ్చరిక.. విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం (జూన్ 14, 2026) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా భారీ హోర్డింగుల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఏయే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటే?

ఆదివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వీటితో పాటు మిగిలిన 23 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు, రైతులు వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com